Omicron Effect : గోవాలో కరోనా కేసుల పెరుగుదలతో స్కూళ్లు, కాలేజీలను జనవరి 26 వరకూ మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. కొవిడ్-19 పరిస్ధితిని సమీక్షించేందుకు జరిగిన టాస్క్ఫోర్స్ భేటీ అనంతరం గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ విషయం వెల్లడించారు.
గోవాలో నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తామని ఆయన చెప్పారు. గోవాలో కొవిడ్-19 పాజిటివిటీ రేటు ఆదివారం 10.7 శాతంగా నమోదైంది. కరోనా కేసులు పెరుగుతున్నందున ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్ధులకు జనవరి 26 వరకూ భౌతిక తరగతులను నిలిపివేయాలని నిర్ణయించామని టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు శేఖర్ సల్కార్ తెలిపార. జనవరి 26 వరకూ కాలేజీలను కూడా మూసివేయాలని నిర్ణయించామని చెప్పారు.
గోవాలో రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమలుకు సంబంధించి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వీక్లీ పాజిటివిటీ రేటు ఐదు శాతంగా ఉండటంతో ప్రభుత్వం పలు నియంత్రణలను అమలు చేస్తోందని చెప్పారు. జనవరి 26లోగా టాస్క్ఫోర్స్ మరోసారి సమావేశమై భవిష్యత్లో చేపట్టే కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.