కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సుకు డిమాండ్ పెరుగుతోంది. ప్రతి సంవత్సరం ఈ కోర్సులో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇదే పరిస్థితి. సీఎస్ఈ పూర్తి చేసిన వెంటనే కొలువులు రావడం.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్యాకేజీలు అందుతుండటంతో విద్యార్థులు అటు వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంటర్లో ఎంపీసీ పూర్తి చేసి ఎంసెట్ రాసిన ప్రతి విద్యార్థి కంప్యూటర్ సైన్స్ చదివేందుకు ఉత్సాహం చూపుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇందుకోసం క్యాపిటేషన్ ఫీజు ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడటం లేదు. గత ఎంసెట్ కౌన్సెలింగ్లో సీఎస్ఈ కోర్సు సీట్లు 99.72 శాతం నిండగా.. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంసెట్ చివరి, ప్రత్యేక కౌన్సెలింగ్లోనూ అదే ట్రెండ్ కొనసాగుతున్నది.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులపై చిన్నచూపు..
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్కు ఫుల్ డిమాండ్ ఉండగా.. అదే సమయంలో కోర్ గ్రూపులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో సగమంటే సగం సీట్లు నిండటం లేదు. ఇందులో సివిల్ 51.7 శాతం, ఎలక్ట్రికల్లో 57.49 శాతం, మెకానికల్లో కేవలం 43.36 శాతం చొప్పున సీట్లు నిండుతున్నాయి. సిటీలో ఉన్న కాలేజీల్లోనే ఈ సీట్లు నిండుతుండగా.. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు కూడా సీఎస్ఈకే మొగ్గు చూపుతూ కోర్ గ్రూపుల్లో భారీగా సీట్లను తగ్గించి ఆ మేరకు సీఎస్ఈలో పెంచుకుంటున్నాయి. మొత్తంగా రెండు సంవత్సరాల్లో 25 వేల సీఎస్ఈ సీట్లు పెరిగినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు వివరిస్తున్నారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నా..
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సులు చదివితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఢోకా లేదు. సాఫ్ట్వేర్తో పాటు పారిశ్రామిక, మార్కెటింగ్ రంగంతో అనేక కీలక ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు కొదవలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రియల్ రంగం పుంజుకుంటున్నది. భారీ పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. అనేక టౌన్షిప్లు వెలుస్తున్నాయి. ప్రత్యేకంగా ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ పేరుతో ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అయినా విద్యార్థులు ఈ కోర్సులపై అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. దీంతో సివిల్ ఇంజినీర్ల కొరత ఏర్పడుతుందని.. కేవలం డిప్లొమా పూర్తి చేసిన వారితోనే సరిపెట్టుకోవాల్సి వస్తున్నదని పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా సీఎస్ఈకే అనుమతులు ఇవ్వడంపై జేఎస్టీయూ హైదరాబాద్ అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణారెడ్డి, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ విశ్వనాథ్రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో ఈ ట్రెండ్ కొనసాగుతున్నా.. ఐఐటీ, ఎన్ఐటీల్లో మాత్రం కేవలం సీఎస్ఈకే కాకుండా అన్ని రకాల ఇంజినీరింగ్ కోర్సులకు డిమాండ్ ఉందని.. దీనిపై విద్యార్థులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని వారంటున్నారు.