లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు l సెన్సెక్స్ 657, నిఫ్టీ 197 పాయింట్లు వృద్ధి ముంబై, ఫిబ్రవరి 9: దేశీయ స్టాక్ మార్కెట్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నది. వరుసగా రెండో రోజూ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 657.39 పాయింట్లు లేదా 1.14 శాతం పుంజుకుని 58,465.97 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 197.05 పాయింట్లు లేదా 1.14 శాతం అందుకుని 17,463.80 వద్ద స్థిరపడింది. మూడు రోజుల నష్టాల నుంచి మంగళవారం మార్కెట్లు కోలుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కొనసాగుతున్న సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఆందోళనలు తగ్గుముఖం పట్టడం కూడా గ్లోబల్ మార్కెట్లకు జోష్నిచ్చింది.
ఆకట్టుకున్న మారుతి
మారుతీ సుజుకీ షేర్ విలువ సెన్సెక్స్ కంపెనీల్లో అత్యధికంగా 4.14 శాతం ఎగిసింది. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, భారతీ ఎయిర్టెల్ షేర్లూ మదుపరులను ఆకట్టుకున్నాయి. అయితే సన్ ఫార్మా, ఐటీసీ, పవర్గ్రిడ్ షేర్ల విలువ 0.72 శాతం మేర దిగజారింది. రంగాలవారీగా ఆటో షేర్లు గరిష్ఠంగా 2.18 శాతం లాభపడగా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇండస్ట్రీ షేర్లూ పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలూ 1.23 శాతం మేర పుంజుకున్నాయి.
ఆగని ఎఫ్ఐఐ అమ్మకాలు
దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం కూడా రూ.1,967.89 కోట్ల విలువైన షేర్లను అమ్మేసినట్టు స్టాక్ ఎక్సేంజీలు చెప్తున్నాయి. ఇక డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మరో 7 పైసలు క్షీణించింది. బుధవారం ట్రేడింగ్లో 74.81 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, చైనా లాభాల్లో.. ఐరోపాలో ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీలూ లాభాల్లోనే కదలాడాయి.