హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): చేపపిల్లల ఉత్పత్తి, మార్కెటింగ్, ప్రాసెసింగ్, శీతల గిడ్డంగుల నిర్వహ ణ తదితర అవసరాల కోసం రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్ల కింద మత్య్సశాఖకు స్థలాలు కేటాయించాలని మత్స్యశాఖ మం త్రి తలసాని శ్రీనివాస్యాదవ్ నీటిపారుదలశాఖను కోరారు. దీనివల్ల రాష్ర్టానికి అవసరమైన చేపపిల్లలను ఇక్కడే ఉత్పత్తి చేయొచ్చని, మంచినీటి చేపల పెంపకానికి కూడా దోహదపడుతుందని చెప్పారు. శనివారం ఆయన మత్స్యశాఖ అధికారులతో మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో సమీక్షిం చారు. రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న మంచినీటి చేపలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు సమగ్ర విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చేపల పెంపకానికి అనువైన నీటి వనరులను గుర్తించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఇరిగేషన్, రెవెన్యూ, మత్స్యశాఖకు చెందిన అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేయాల్సిన అవసరమున్నదని పేరొన్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చేపలను పెంచేందుకు అవకాశం ఉన్న కేజ్ కల్చర్పై దృష్టి సారించాలని సూచించారు. కేజ్ కల్చర్ ద్వారా రాష్ట్రంలో ఏటా రూ.15 వేల కోట్ల విలువైన మత్స్యసంపదను సృష్టించే అవకాశం ఉన్నదని చెప్పారు. పాలేరు రిజర్వాయర్లో చేపట్టిన కేజ్ కల్చర్పై నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ ఏడాది 28,704 చెరువులు, రిజర్వాయర్లలో 93 కోట్ల చేపపిల్లలను విడుదల చేస్తున్నట్టు వివరించారు. ఇప్పటికే 28 వేల చెరువులకు జియోట్యాగింగ్ చేసినట్టు చెప్పారు. సమావేశంలో మత్స్యశాఖ అధికారులతోపాటు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, జాయింట్ సెక్రెటరీ భీమ ప్రసాద్, నేషనల్ ఇంఫర్ మ్యాటిక్స్ అధికారులు పాల్గొన్నారు.