ప్రభుత్వ విప్ బాల్క సుమన్
హుజూరాబాద్, అక్టోబర్ 26 : అబద్ధాల బీజేపీకి ఉప ఎన్నికలో ఓటుతో సమాధానం చెప్పాలని విప్ బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం హుజూరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎకరం అమ్మితే ఎన్నికల్లో గెలుస్తానన్న ఈటల.. బొట్టుబిల్లలు, గడియారాలు, మిక్సీలు, గొడుగులు, క్వార్టర్ బాటిళ్ల పంపిణీకి ఎన్ని ఎకరాలు అమ్మారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం మీ కోళ్లఫారం నుంచి ఇంటింటికి చికెన్ పంచుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఓటుకు రూ.5వేలు, ఇంటికో ఫుల్బాటిల్ మద్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈటల.. టీఆర్ఎస్ ఓటుకు రూ.20 వేలు ఇస్తారని తప్పుదోవ పట్టించడం వెనుక ఆంతర్యమేంటోనని అన్నారు. ఓటమి భయంతో కేసీఆర్ సభను అడ్డుకున్న నీచ సంస్కృతి బీజేపీదని ధ్వజమెత్తారు. సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.