హైదరాబాద్ : ఈ ఏడాది కాలంలో నగర అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్టు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. మేయర్గా బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా.. ఈ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఓ బుక్లెట్ను మేయర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఎస్ఆర్డీపీలో భాగంగా అనేక ఫ్లై ఓవర్లు నిర్మించామని చెప్పారు. సీఆర్ఎంపీ కింద అన్ని జోన్లలో రోడ్ల మరమ్మతులు చేపట్టినట్లు వివరించారు. సంగారెడ్డిజిల్లా కొల్లూరులో 117 బ్లాకుల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే లబ్దిదారులకు అందజేస్తామని మేయర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించామని స్పష్టం చేశారు. ఆ ఇండ్లను చూస్తుంటే సంతోషం కలుగుతుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో భాగంగా 65 వేల ఇండ్లను పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు 5 వేల ఇండ్లను లబ్దిదారులకు అందజేశామన్నారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో వరద ముంపు సమస్య పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. తొలిదశలో రూ. 858 కోట్లతో ఎస్ఎన్డీపీ పనులు చేపడుతామన్నారు. వర్షాకాలం నాటికి 52 ప్రాంతాల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మిస్తున్నామని మేయర్ తెలిపారు. తన చాంబర్లో రభస చేయడం బీజేపీ కార్పొరేటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని మేయర్ విజయలక్ష్మి స్పష్టం చేశారు.