హైదరాబాద్, జనవరి 26 : సిటీ లైఫ్ అంటే పిటీ లైఫ్ కాదు.. సిటీ లైఫ్ అంటే బ్యూటిఫుల్ లైఫ్ అనేలా రాష్ట్ర పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. పట్టణ జనాభా 50 శాతానికి చేరువవుతున్న తరుణంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించటంలో రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ‘పట్టణ ప్రగతి’ ద్వారా పట్టణాలు, నగరాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మార్గదర్శనంలో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు నేతృత్వంలో రాష్ట్ర పట్టణాలు, నగరాలు ఆదర్శవంతంగా మారుతున్నాయి. 2019 జూలై 23న కొత్త పురపాలన చట్టాన్ని తీసుకురాగా, 2020 జనవరి 27 నుంచి కొత్త పాలకవర్గాలు కొనసాగుతున్నాయి. ఆ మరుసటి నెల ఫిబ్రవరి 24 నుంచి పట్టణ ప్రగతి ప్రారంభమైంది. ఈ నెల 27తో రెండేండ్లు పూర్తి చేసుకొంటున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 68 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ఉండేవి. సీఎం కేసీఆర్ కొత్తగా 74 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం జీహెచ్ఎంసీతో సహా కలిపి 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి.
ప్రతి పట్టణానికి మాస్టర్ ప్లాన్
రాష్ట్రవ్యాప్తంగా 70 పట్టణాలు, నగరాలకు మాస్టర్ ప్లాన్ ఉండగా, 35 పట్టణాలకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన తుది దశకు చేరింది. మరో 37 పట్టణాలకు జూన్ 2 కల్లా మాస్టర్ ప్లాన్ను రూపొందించనున్నారు. జీఐఎస్ మ్యాపింగ్ చేయనున్నారు.
టీఎస్బీపాస్
నగరాలు, పట్టణాల్లో ఇంటి అనుమతుల్లో అవినీతి, జాప్యానికి ఆస్కారం లేకుండా టీఎస్బీపాస్ను అమలు చేస్తున్నారు. 600 గజాల భవనాలకు సైతం ఈ విధానంలో అనుమతులు ఇస్తున్నారు. 75 గజాల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేకుండానే ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ విధానంలో అనుమతులు లభిస్తున్నాయి. 75 నుంచి 240 గజాల వరకు ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ విధానంలో అనుమతులు ఇస్తున్నారు. 60 నుంచి 598 గజాల వాణిజ్య భవనాలకు ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ విధానంలో అనుమతులు జారీ చేస్తున్నారు.
ఎఫ్ఎస్టీపీలు
పాత మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో 71 ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ)లను రూ.250 కోట్లతో 1,565 కేఎల్డీ సామర్థ్యంతో నిర్మించడానికి టెండర్లు పిలిచారు. వీటిలో ఇప్పటికే 12 పూర్తి కాగా, మరో 11 ముగింపు దశక చేరుకున్నాయి. మరో 69 పట్టణ స్థానిక సంస్థల్లో రూ.150 కోట్లతో 495 కేఎల్డీ సామర్థ్యంతో ఎఫ్ఎస్టీపీలను నిర్మించడానికి టెండర్లు పిలిచారు. హైదరాబాద్ మినహా మిగిలిన 141 పట్టణ స్థానిక సంస్థల్లో 966 ఎకరాల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశారు. 206 డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఓడీఎఫ్ ప్లస్గా 100 పట్టణాలు గుర్తింపు పొందాయి. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ పట్టణాలుగా ఎనిమిది గుర్తింపు పొందాయి.
వెయ్యిమందికో మరుగుదొడ్డి
రాష్ట్రంలో గతంలో 4,970 ప్రజా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉండేవి. కొత్తగా 4,118 ప్రజా మరుగుదొడ్లు, మూత్రశాలలను నిర్మించారు. ఇప్పుడు రాష్ట్రంలో 9,088 మూత్రశాలలు ఉన్నాయి. ఇందులో పురుషులకు 5,448, మహిళలకు 3,640 ఉన్నాయి. వీటి ద్వారా నగరాలు, పట్టణాలకు వివిధ పనుల కోసం వచ్చే వారికి ఇబ్బందులు తప్పాయి. యాప్ ద్వారా వాటి పరిశుభ్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పట్టణంలో అన్ని రకాల సదుపాయాలతో కూడిన వైకుంఠధామాలను నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వీటి కోసం రూ.200 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. 265 శ్మశానవాటికలను వైకుంఠధామాలుగా అభివృద్ధి చేస్తున్నారు. 117 పట్టణ స్థానిక సంస్థల్లో 105 పరమపద వాహనాలను అందుబాటులో ఉంచారు.
వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు
రాష్ట్రంలో ప్రతి పట్టణం, నగరానికి కనీసం ఒక ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీని కోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించారు. ఇప్పటికే గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట, ధర్మపురి, మంథనిలో వీటిని నిర్మించారు. ఐజ, గద్వాల, తూఫ్రాన్, బెల్లంపల్లి, భువనగిరిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 141 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో 153 స్థలాలను మార్కెట్లను నిర్మించడానికి గుర్తించారు. 89 పట్టణ స్థానిక సంస్థల్లో 94 స్థలాల్లో నిర్మాణ పనులు చేయడానికి కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందాలు జరిగాయి.
వార్డుకో పార్కు
ప్రతి వార్డు, డివిజన్కు ఒక పార్కు ఉండాలనే ఉద్దేశంతో పట్టణ ప్రగతిలో పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. 2020లో 1,401 ట్రీ పార్కులను ఏర్పాటు చేశారు. వీటిల్లో 43.32 లక్షల మొక్కలు నాటారు. 2021లో 864 ట్రీ పార్కులను అభివృద్ధి చేశారు. వీటిల్లో 20.95 లక్షల మొక్కలు నాటారు. వీటికి అదనంగా బృహత్ పట్టణ ప్రకృతి వనాలు(బీపీవీ)లను ఏర్పాటు చేస్తున్నారు. 1,027 నర్సరీలను ఏర్పాటు చేశారు. 93 పట్టణ స్థానిక సంస్థల్లో 369 ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశారు. పట్టణాల్లో 9.31లక్షల ఎల్ఈడీ విద్యుత్తు దీపాలను అమర్చారు.
నిధులు విడుదల ఇలా..
రెండేండ్లలో పట్టణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం మొత్తం రూ.3,192 కోట్లు విడుదల చేసింది. టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.2 వేల కోట్లను పట్టణాల అభివృద్ధికి వెచ్చించింది. వివిధ పథకాలకు దాదాపు రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఇంటింటికీ నల్లా నీటిని అందించే పనులకోసం రూ.6 వేల కోట్ల వరకు వెచ్చిస్తున్నది. కరెంటు బిల్లుల కోసమే రూ.300 కోట్లు ఖర్చు చేశారు. దాదాపు 111 స్థానిక సంస్థలు రూ.3 వేల కోట్లు రుణంగా తీసుకొని అభివృద్ధి పనులకు ఖర్చు చేయటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
వచ్చిన అవార్డులు
స్వచ్ఛ సర్వేక్షణ్ కింద రాష్ర్టానికి 12 అవార్డులు వచ్చాయి. రాష్ట్రం క్యాటగిరీలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్లో కరీంనగర్ పట్టణం దేశంలో రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ గార్బేజ్ ఫ్రీ సిటీగా అవార్డు దక్కించుకొన్నది. బెస్ట్ సెల్ఫ్ సస్టెయినింగ్ సిటీగా ఎంపికైంది. సిద్దిపేట, సిరిసిల్ల, ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, నిజాంపేట, కోస్గి, కంటోన్మెంట్, హుస్నాబాద్ పట్టణాలు అవార్డులను దక్కించుకొన్నాయి. ఎలోటెక్ట్ టెక్నో మీడియా ద్వారా తెలంగాణ ఈ-మున్సిపల్ సర్వీసులకు ఎక్స్లెన్స్ అవార్డు దక్కింది. పట్టణ ఆస్తుల భౌగోళిక ప్రాదేశిక మ్యాపింగ్ కోసం 2020లో జనగ్రహ నగర పరిపాలన అవార్డును అందించారు. ఇండియన్ ఎక్స్ గ్రూప్ ద్వారా పట్టణ ప్రగతి పబ్లిక్ టాయిలెట్ పర్యావరణ వ్యవస్థకు డిజిటల్ టెక్నాలజీ ఎక్స్లెన్సీ అవార్డు వచ్చింది.
పట్టణాలు పరిమళించె
రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 37.19 లక్షల చెత్తబుట్టలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో 24.92 లక్షల ఇండ్ల నుంచి ప్రతి రోజు చెత్తను సేకరిస్తున్నారు. గతంలో కేవలం 2,628 వాహనాలు ఉండగా, రెండేండ్లలో అదనంగా 2,214 పారిశుద్ధ్య వాహనాలను కొనుగోలు చేశారు. ఫలితంగా రోజుకు 4,295 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు.
స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది
ఆదిలాబాద్ అభివృద్ధిలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ప్రతి నెలా మున్సిపాలిటీకి నిధులు వస్తున్నాయి. వీటికి అదనంగా ఇతర శాఖల నుంచి నిధులు వచ్చాయి. పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాలు, బ్యూటిఫికేషన్, మొక్కల పెంపకాన్ని పెద్దఎత్తున చేపట్టాం. ఎఫ్ఎస్టీపీ పూర్తయింది. డంపింగ్ యార్డును ఆధునీకరించాం. వెజ్, నాన్వెజ్ మార్కెట్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఎన్నుకొన్న ప్రజలకు మేము గర్వంగా ఇన్ని పనులు చేశామని చెప్పగలుగుతున్నాం. -జోగు ప్రేమేందర్, మున్సిపల్ చైర్మన్, ఆదిలాబాద్
మా పట్టణాన్ని సుందరంగా మార్చుకొన్నాం
రెండేండ్లలో సత్తుపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం. పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచాం. రూ.20 కోట్లతో సీసీ రోడ్లు వేశాం. మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన రూ. 30 కోట్లకు సంబంధించిన పనుల సర్వే కొనసాగుతున్నది. పట్టణ ప్రగతి కింద నగర సుందరీకరణ పనులు చేస్తున్నాం. పట్టణ ప్రకృతి వనాలు, మినీ పార్కులను ఏర్పాటు చేశాం. శ్మశానవాటిక, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది. -కూసంపూడి మహేశ్, మున్సిపల్ చైర్మన్, సత్తుపల్లి