George Soros | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ రాజకీయాలనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఈ క్రమంలో బిలియనీర్ ఇన్వెస్టర్, వితరణశీలి జార్జ్ సోరోస్ భారత ప్రధాని నరేంద్రమోదీ, అదానీ గ్రూప్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ ఉదంతంపై మోదీ స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. ఈ ఘటన భారత్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు బాటలు వేస్తున్నట్టు పేర్కొన్నారు. జర్మనీలో జరుగుతున్న మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో దాదాపు 42 నిమిషాలపాటు ప్రసంగించిన సోరోస్.. అదానీ వ్యవహారంపై మోదీ స్పందనతో పాటు వాతావరణంలో మార్పులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, టర్కీ భూకంపం, చైనా వైఫల్యాల గురించి ప్రస్తావించారు.
జార్జ్ సోరోస్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి స్మృతిఇరానీ ఖండించారు. ఆయన వ్యాఖ్యలు భారత దేశంపై దాడిగానే పరిగణించాలని అన్నారు. సోరోస్కు ప్రతి భారతీయుడు గట్టి బదులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ను బద్ధలు కొట్టిన సోరోస్ను ఆ దేశం ఆర్థిక యుద్ధ నేరస్తుడిగా గుర్తించిందన్నారు.
జార్జ్ సోరోస్ (92) ప్రపంచ కుబేరుల్లో ఒకరు. వితరణకారిగా పేరు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ను స్థాపించి ప్రజాస్వామ్యం, పారదర్శకత, వాక్స్వేచ్ఛ పరిరక్షణకు కృషిచేశారు. 70కి పైగా దేశాల్లో ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 1992లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్లో షార్ట్ సెల్లింగ్ చేసి పౌండ్ విలువను షార్ట్ చేశారు. దీంతో 100 కోట్ల డాలర్లను సంపాదించారు. అమెరికాలోని డెమొక్రటిక్ పార్టీ నేతలు ఒబామా, హిల్లరీ, బైడెన్ల అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఇదే సమయంలో చైనా, డొనాల్డ్ ట్రంప్ వైఖరిని బహిరంగంగానే తప్పుబట్టారు. 2020లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో ప్రసంగించిన ఆయన.. కశ్మీర్లో కఠిన చర్యలు తీసుకొంటున్నారని, ముస్లిం పౌరులను తమ పౌరసత్వానికి దూరం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదని మండిపడ్డారు.