కరీంనగర్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): జాతీయ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీ హుజూరాబాద్లో తనను ఓడించేందుకు ఒక్కటయ్యాయని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఈటల రాజేందర్ గెలుస్తాడని రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ బహిరంగంగా ప్రకటించడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. మంగళవారం ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈటలతో కుమ్మక్కయినందునే కాంగ్రెస్ ఉనికిలో లేకుండాపోయిందని చెప్పారు. బల్మూరి వెంకట్ను కాంగ్రెస్ నాయకులు బలిపశువును చేశారని పేర్కొన్నారు. నైతికంగా తామే గెలిచామని పేర్కొన్నారు.
ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని, తనకు ఓట్లు వేసిన వారందరికీ పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. తన కోసం కష్టపడిన టీఆర్ఎస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నదని, హుజూరాబాద్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నిలబెట్టుకొంటానని స్పష్టంచేశారు. ఈ ఓటమికి తనదే నైతిక బాధ్యత అని చెప్పారు.