అది 1987వ సంవత్సరం. పంజాబ్లో తీవ్రవాదం తారస్థాయికి చేరుకున్న సందర్భం. ఎటుచూసినా భయం. దాయాది దేశాల మధ్య అసహనం. ఈ నేపథ్యంలో పంజాబ్ మూలాలున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ సాహసం చేశారు. మహాశాంతి యాత్ర పేరుతో ముంబై నుంచి అమృత్సర్ వరకు దాదాపు రెండువేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 76 రోజుల పాటు సాగిన ఈ నడకలో భాగంగా ఐదొందల సమావేశాల్లో మాట్లాడారు. కోల్కతాలో ఉంటున్న గీత బాలకృష్ణన్ను ఈ సంఘటన కదిలించింది. గీత వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. తను కూడా దేశాన్ని అతి దగ్గర నుంచి చూసేందుకు పాదయాత్రను ఎంచుకున్నారు.
2021లో తొలిసారి కోల్కతా నుంచిదిల్లీకి ప్రయాణించారు. మళ్లీ ఇప్పుడు మలి విడత యాత్ర మొదలుపెట్టారు. రోజుకు సగటున 30-32 కిలోమీటర్లు నడుస్తూ.. దారిమధ్యలో వేలాది జనంతో మాట్లాడు తున్నారు. రోజుకు రెండున్నర గంటలు సంభాషణలకే కేటాయిస్తారు. తను ఆర్కిటెక్ట్ కాబట్టి, ప్రభుత్వ నిర్మాణాలు అన్ని వర్గాలకూ అనుకూలంగా, అందరికీ ఉపయోగపడేలా ఉండాలన్నది ఆమె అభిప్రాయం. ఆ విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం చెన్నై నుంచి బెంగళూరు వరకు పాదయాత్ర చేస్తున్నారు గీత.