న్యూఢిల్లీ, జనవరి 31: ఒకవైపు ద్రవ్యోల్బణం కోరలు చాస్తుంటే మరోవైపు ప్రపంచంలో వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలుపుకుంటుందని బడ్జెట్ ముందస్తు ఆర్థిక సర్వే వెల్లడించింది. అయితే పలు సానుకూల అంశాలు తొడైతేనే ఇది సాధ్యమని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 8-8.5 శాతం వృద్ధిచెందుతుందని సర్వే అంచనా వేస్తూ భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థిక వ్యవస్థ సంసిద్ధమై ఉందని తెలిపింది. అలాగే అవసరమైతే ఆర్థిక వ్యవస్థకు మద్దతును ఇచ్చే ఆర్థిక సత్తా ప్రభుత్వానికి ఉందని నొక్కిచెప్పింది. ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతం వృద్ధి సాధించి, ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా స్థానం సంపాదించుకుంటుందని ఆర్థిక సర్వే ప్రకటించింది. వాక్సిన్ కవరేజ్ విస్త్రతంగా జరగడం, సరఫరా వైపు సంస్కరణలు చేపట్టడం, నియంత్రణల్ని సడలించడం వంటి అంశాలతో వృద్ధి జోరు కొనసాగుతుందన్న ధీమాను వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ వార్షిక నివేదిక అయిన ఈ సర్వేను సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ నేతృత్వంలో ఈ సర్వే రూపొందింది. తాజా సర్వే నేపథ్యంలో మంగళవారం బడ్జెట్ ప్రతిపాదనల్ని ఆర్థిక మంత్రి సమర్పించనున్నారు.
2021- 2022 ఆర్థిక సర్వే ప్రధానాంశాలివి
కొవిడ్ మేఘాలు తొలగితే పెట్టుబడులు పెరుగుతాయ్
దేశంలో చేపట్టిన వ్యాక్సినేషన్తో కొవిడ్ పాండమిక్ తొలగిపోతే, పెట్టుబడులు పెరుగుతాయి. దీంతో ఉపాధి కల్పన జరుగుతుంది. వినియోగమనేది ఆదాయ వృద్ధి తగ్గడంవల్లే ప్రభావితం కాదు. కరోనా అనిశ్చితి, ఆరోగ్య సమస్యలూ కారణమే. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలతో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని, తద్వారా ఆదాయ వృద్ధి, ఉపాధి కల్పన జరుగుతుందని విశ్వసిస్తున్నాం. –అనంత్ నాగేశ్వరన్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు
2020-21లో మైనస్ 6.6 శాతం వృద్ధి
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను దేశ వృద్ధిరేటు మైనస్ 6.6 శాతం మాత్రమేనని కేంద్ర గణాంకాల శాఖ సోమవారం తాజాగా వెల్లడించింది. గతంలో మైనస్ 7.3 శాతంగా ఉన్నదని అంచనావేసిన గణాంకాల శాఖ..కరోనాతో దేశవ్యాప్త లాక్డౌన్తో వృద్ధిరేటుపై ప్రభావం పడిందని తెలిపింది. 2011-12 ధరల ప్రకారం 2020-21లో దేశ జీడీపీ విలువ రూ.135.58 లక్షల కోట్లు కాగా, అంతక్రితం ఏడాది 2019-20లో రూ.145.16 లక్షల కోట్లుగా ఉన్నదని పేర్కొంది. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను వృద్ధిని 4 శాతం నుంచి 3.7 శాతానికి కుదించింది.
దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రానికి అద్దం పట్టే ఆర్థిక సర్వే క్రిందటిసారితో పోల్చితే ఈసారి సగానికిపైగా పేజీలను తగ్గించుకున్నది. 1950-51 నుంచి ఆర్థిక సర్వే మొదలవగా, ఆరంభంలో 50 పేజీల కంటే తక్కువగానే ఉండేది. అయితే రికార్డు స్థాయిలో 2020-21కిగాను 877 పేజీలకు పెరిగింది. తాజాగా వచ్చిన 2021-22 సర్వే మాత్రం 413 పేజీలుగా ఉన్నది.