సిటీబ్యూరో, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): అడవిలో ల్యాండ్ మార్క్..అక్కడ ఖాళీ బండి పెడితే.. గంజాయి నింపాక వెనక్కి.. వాసన రాకుండా స్ప్రే.. మూడు రోజుల పాటు ప్రయాణం.. అదీ రాత్రుల్లోనే.. ట్రావెల్స్ యజమాని యాసిన్ సాగించిన గంజాయి దందా ఇది. ఇలా పోలీసుల కండ్లు గప్పి.. ఏడాది పాటు విజయవంతంగా వేలాది కిలోల సరుకును మహారాష్ట్రకు తరలించాడు. హైదరాబాద్లో మత్తు బాబులకు అధిక ధరలకు విక్రయించాడు. ఎస్వోటీ పోలీసులు ఈ ముఠా గుట్టును రట్టు చేయగా, సరుకు తీసుకొచ్చేందుకు యాసిన్ ఎంత పకడ్బందీగా వ్యవహరించాడనే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అడవిలో ల్యాండ్ మార్క్…
నాచారం ప్రాంతానికి చెందిన ట్రావెల్స్ యజమాని యాసిన్ తన దగ్గర కారు డ్రైవర్లుగా పని చేసిన వారిని గంజాయి దందాలో పాత్రధారులుగా చేయడంతో వారంతా నమ్మకంగా పనిచేసేవారు. యాసిన్ గంజాయి తీసుకొచ్చేందుకు సీలేరుకు చెందిన వ్యాపారులతో లింక్లు పెట్టుకున్నాడు. సరుకు తీసుకొచ్చేందుకు కార్లలో వెళ్లేవాడు. వెంట ఆటోలను కూడా తీసుకెళ్లేవాడు.అతడు సీలేరుకు చేరుకోగానే అక్కడి గంజాయి వ్యాపారుల నుంచి ఫోన్ వచ్చేది. అడవిలో 3 కిలో మీటర్లు ప్రయాణించిన తర్వాత.. ఓ కొండను ల్యాండ్ మార్క్గా ఉపయోగించుకునేవాడు. గూడ్స్ ఆటోలను నిలిపి.. అందరూ తిరిగి 3 కిలో మీటర్లు నడిచి వచ్చేవారు. 24 గంటలు గడిచిన తర్వాత గంజాయి నింపిన గూడ్స్ ఆటో తిరిగి ఆ ల్యాండ్ మార్క్ వద్ద పెట్టేసి గంజాయి వ్యాపారులు వెళ్లిపోయి యాసిన్కు ఫోన్ చేసేవారు. ఆ తర్వాత యాసిన్ డ్రైవర్లు వాటిని తీసుకుని బయటికి వచ్చేవారు. మేడిపల్లిలోని గ్యారేజీకి మూడు రోజుల తర్వాత తీసుకువచ్చి వాటిని ప్యాకెట్లుగా చేసి తిరిగి యాసిన్ ఆదేశాల మేరకు తన్నీరు సంతోష్, సుగురు వాసుదేవారెడ్డి, పొన్నం రాజేశ్వర్, చుంచు రవీందర్, మంద మధులు వాటిని డెలివరీ చేసేవారు. అయితే గంజాయి తరలింపు ప్రయాణం రాత్రి సమయాల్లోనే చేసేవారు.
వాసన రాకుండా స్ప్రేలు చల్లి..
అయితే మేడిపల్లి కొద్దిగా నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో ఆటో గ్యారేజీ ఉండడంతో అక్కడ నిల్వ చేసిన గంజాయి నుంచి వాసన రాకుండా ప్రతి మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో స్ప్రేలను చల్లేవారు. ఇలా ఏడాది కాలంగా యాసిన్ తన అనుచరులతో గంజాయి దందాను నిర్వహిస్తున్నాడు. మహారాష్ట్ర వ్యాపారులతో సంబంధాలు పెట్టుకున్నాడు. హైదరాబాద్లో కూడా యాసిన్ వారి వివరాలను తెలియకుండా కేవలం ల్యాండ్ మార్క్, వాహన నంబర్, అంగీ రంగు ఇతర గుర్తుల ఆధారంగానే గంజాయి డెలివరీ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పుడు యాసిన్ పట్టుబడితేనే ముఠా నాయకుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
పట్టుబడిన గంజాయి విక్రయదారుడు
ఖైరతాబాద్, నవంబర్ 15 : ఖైరతాబాద్లోని ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ప్రకాశ్రాజ్ అలియాస్ డాలర్ పింటు (20) అనే యువకుడిని సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.