తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల సంబరంలో గజరాజులు, అశ్వాలు, వృషభాలు కీలకపాత్ర పోషించనున్నాయి. స్వామివారి వాహనసేవల్లో తొలి అడుగు వీటిదే. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కనువిందు చేస్తాయి. సర్వాంగసుందరంగా అలంకరించిన ఈ జంతువులు ఠీవిగా ముందుకు కదులుతూ స్వామివారు వస్తున్నారన్న సంకేతం ఇస్తాయి. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గో సంరక్షణశాలలో వీటి ఆలనా పాలనా చూస్తూ సంరక్షిస్తున్నారు.
బ్రహ్మోత్సవాల వాహనసేవల్లో వినియోగించే జంతువులకు తగిన శిక్షణ కూడా ఇస్తారు. మావటిలు తాళ్లు, అంకుశం (ముల్లు కట్టె), గొలుసులతో నిరంతరం అప్రమత్తంగా ఉండి గజరాజులను నియంత్రిస్తారు. జంతువులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఊరేగింపులకు వినియోగిస్తారు. జంతువుల వెంట జంతుశాస్త్ర నిపుణులు కూడా ఉంటారు. అనుకోని సంఘటనలు జరిగినపుడు జంతువులను నియంత్రించేందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. మాడవీధుల్లో గజరాజులు తిరిగేందుకు ప్రత్యేక మార్గాన్ని కూడా రూపొందించడం విశేషం. ఏనుగులను అదుపు చేసేందుకు కేరళ నుంచి నిపుణులైన పశువైద్యులను రప్పిస్తారు.
వాహనసేవల్లో పాల్గొనే జంతువులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. గజరాజులను ముఖపట్టాతోపాటు రంగురంగుల బొంతలతో అలంకరిస్తారు. మావటిలు గొడుగులు, విసనకర్రలతో స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు. గరుడసేవ రోజున ప్రత్యేకంగా అలంకరణతో దర్శనమిస్తారు. అశ్వాలను ముఖపట్టా, తలపై కుచ్చు, బొంతలు, మెడగజ్జలు, కాళ్లపట్టీలతో అలంకరిస్తారు. రైతన్నలకు నేస్తాలైన వృషభాలను మెడలో నల్లతాడు, పూలహారాలు, గజ్జలు, బొంతలతో అలంకరిస్తారు.
వాహనసేవల్లో ఈ జంతువులకు ఇష్టమైన రావి ఆకులు, మర్రి ఆకులు, రాగి సంకటి, చెరకు గడలను ఆహారంగా ఇస్తారు. మాడ వీధుల్లో తిరిగే సమయంలో క్రమం తప్పకుండా ఆహారాన్ని, ఆలయం వద్ద నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయ మాడవీధుల్లో వాహనసేవల సమయంలో శక్తివంతమైన విద్యుత్దీపాల వెలుగులు, కళాకారుల వాయిద్యాల శబ్దం నుంచి ఏనుగులకు ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని ఎస్వీ గోసంరక్షణ శాల సంచాలకులు డాక్టర్ హరినాథ్రెడ్డి తెలిపారు.