Srisailam | శ్రీశైలం భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో పౌర్ణమి ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. లోక కళ్యాణార్ధం పరివార దేవతలకు అర్చనలు అభిషేకాలు ఘనంగా జరిపించినట్లు ఈవో ఎస్ లవన్న తెలిపారు.
శుక్రవారం సాయంత్రం పౌర్ణమి గడియల్లో ఆలయ ప్రాకారంలో స్వామి అమ్మవార్ల ఉత్సమూర్తులను పల్లకిలో ఆశీనులను జేసి ఆలయ ప్రదక్షిణానంతరం క్షేత్ర గిరి ప్రదక్షిణ చేశారు. అర్చక వేదపండితులు భక్తులు శివనామస్మరణ చేశారు. నందిమండపం నుండి బయలు వీరభద్రస్వామి ఆలయం మీదుగా శివనామస్మరణ చేస్తూ సాగిన గిరిప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పౌర్ణమి సంధ్యా సమయంలో భ్రామరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేసిన అనంతరం ఊయల సేవ, పల్లకి సేవ జరిపించారు. ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసిన అర్చకులు అష్టోత్తర నామావళిని పఠించారు.
తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో వేంచెంబు చేసి ఆలయ ప్రదక్షిణగా అర్చక వేదపండితులు ఉత్సవం జరిపించారు. ఉభయ దేవాలయాల్లో పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాలో భక్తులు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.