నార్నూర్/బజార్హత్నూర్, జూలై 16 ;గతంలో ఏదైనా కారణంతో రైతులు మరణిస్తే బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రైతుల కోసం ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకానికి మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో దరఖాస్తు చేయనివారు, కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఎలాంటి ప్రీమియం లేకుండా భూమి పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకుఖాతా వివరాలను సంబంధిత ఏఈవోలను కలిసి అందించాలి. ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా, ఆగస్టు14వ తేదీ వరకు గడువు విధించారు.
భుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు ఎంతో ధీమా ఇస్తున్నది. ఏదైనా ప్రభుత్వ పథకం అందాలంటే పలుకుబడి ఉన్న వారిని ఆశ్రయించడమో, దళారులను నమ్ముకోవడమో చేసుండాలి. అలాంటిదేమీ లేకుండా రైతులకు బీమా పథకాన్ని అమలు చేస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు మరణించిన పది రోజుల్లోగా నేరుగా బాధిత కుటుంబంలో నామినీగా ఉన్న వారి బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమ చేస్తున్నది. ఈ క్రమంలో నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఇప్పటి వరకు 220 మంది , బజార్హత్నూర్లో 200 మంది రైతు కుటుంబాలు రైతుబీమా అందుకున్నాయి. గతంలో ఏదైనా కారణంతో రైతులు మరణిస్తే బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రైతుల కోసం ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది. దీంతో చిన్న, సన్నకారు, బడా రైతులంటూ తేడా లేకుండా ఏ రైతు ఏదేని కారణంతో మరణించినా బాధిత కుటుంబాలకు ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నది.
అంతా పారదర్శకంగా..
రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు15వ తేదీ నుంచి రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. 18 నుంచి 59 ఏండ్ల వరకు రైతుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి, అర్హులైన వారికి బీమా పత్రాలు అందజేశారు. రైతులపై ఎలాంటి ఆర్థికభారం లేకుండా ప్రభుత్వమే ఎల్ఐసీకి రైతుల పేరిట బీమాకు సంబంధించిన ప్రీమియం సొమ్ము జమ చేస్తున్నది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కఠిన నిబంధనలున్నాయి. ఈ పథకంలో పేరు నమోదైన రైతు ఏ కారణంతో మరణించినా బాధిత కుటుంబానికి బీమా సొమ్ము 10 రోజుల్లో అందిస్తూ పారదర్శకతను పాటిస్తున్నారు. నామినీగా ఉన్న వారికి రూ.5 లక్షల బీమా సొమ్మును బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తున్నారు.
ఒక్కో రైతుకు ప్రీమియం రూ.3,437..
ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.3,437 ప్రీమియంగా చెల్లిస్తున్నది. నార్నూర్, గాదిగూడ, బజార్హత్నూర్ మండలాల పరిధిలో రైతుబీమా పథకం అమలు చేస్తున్నారు. పథకం ప్రారంభించిన 2018 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు నార్నూర్, గాదిగూడ మండలాల్లో 310 మంది, బజార్హత్నూర్ మండలంలో 200 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున రూ.14.57 కోట్లు, బజార్హత్నూర్ మండలంలో రూ.10కోట్ల సాయం అందజేసినట్లు వ్యవసాయశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
ఆగస్టు 5 వరకు దరఖాస్తుల స్వీకరిస్తాం
18 నుంచి 59 ఏండ్ల వయసున్న ప్రతి రైతుకూ రైతు బీమా పథకం వర్తిస్తోంది. రైతు చనిపోతే నామినీ బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం జమ చేస్తున్నది. రైతులు ఈ నెల 10 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆయా గ్రామాల్లోని రైతు వేదికల్లో ఏఈవోలకు ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా, పాసుపుస్తకాల జిరాక్స్లు అందించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. గ్రామాల్లో ఏఈవోల ద్వారా ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నాం. 2018 నుంచి మండలంలో ఇప్పటి వరకు 200 మంది రైతు కుటుంబాలకు రూ.10కోట్ల సాయం అందింది.
-మండల వ్యవసాయధికారి ప్రమోద్రెడ్డి, బజార్హత్నూర్
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
రైతుబీమా పథకానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన రైతులు పట్టాపాసు పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకుఖాతా వివరాలు నమోదు చేయించుకోవాలి. రైతులు ఏదేని కారణంతో మరణిస్తే, విషయం ఫోన్లో సమాచారం ఇచ్చినా ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. పది రోజుల్లోగా నామినీగా ఉన్న వ్యక్తి బ్యాంకు ఖాతాలో బీమా సొమ్ము రూ.5 లక్షలు జమ అవుతున్నాయి. కొత్తగా పాస్పుస్తకాలు పొందిన వారు, గతంలో వివరాలు అందించని వారు ఆయా క్లస్టర్ల పరిధిలోని అధికారులకు దరఖాస్తులు అందజేయాలి.
– గిత్తే రమేశ్, వ్యవసాయశాఖ అధికారి, నార్నూర్