న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ ప్రాబబుల్స్లో తెలంగాణ స్టార్ ప్యాడ్లర్లు స్నేహిత్, ఆకుల శ్రీజ స్థానం దక్కించుకున్నారు. మెగాటోర్నీ కోసం సోమవారం భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ప్రాబబుల్స్కు ఎంపిక చేసిన 16 మంది జాబితాలో వీరిద్దరికి చోటు దక్కింది. ఇటీవల షిల్లాంగ్లో జరిగిన జాతీయ చాంపియన్షిప్లో ఆకుల శ్రీజ టైటిల్ పట్టగా.. అంతర్జాతీయ పురుషుల టీటీ ర్యాంకింగ్స్లో స్నేహిత్ భారత్ నుంచి నాలుగో స్థానంలో నిలిచాడు. వీరితో పాటు పదోసారి జాతీయ టైటిల్ను నెగ్గిన శరత్ కమాల్, స్టార్ ప్యాడ్లర్లు సాతియాన్, మనిక బాత్రా ప్రాబబుల్స్కు ఎంపికయ్యారు. జాతీయ చాంపియన్షిప్లో ప్రదర్శన ఆధారంగా ప్లేయర్లను ఎంపిక చేసినట్లు అడ్మినిస్ట్రేటర్ల కమిటీ సభ్యుడు ఎస్డీ ముద్గిల్ తెలిపారు. ఈనెల 23-30 మధ్య బెంగళూరులో వీరికి శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. అందులో సత్తా చాటిన వారికి బర్మింగ్హమ్ కామన్వెల్త్ క్రీడల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కనుంది.
పురుషులు: సాతియాన్, శరత్ కమాల్, మనుష్ షా, స్నేహిత్, మానవ్ ఠక్కర్, హర్మీత్ దేశాయ్, సనీల్ శెట్టి, అనిర్బన్ ఘోష్.
మహిళలు: మనికా బాత్రా, అర్చనా కామత్, ఆకుల శ్రీజ, రీత్ రిష్యా, సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ, దియా చితలె, స్వాస్తిక ఘోష్.