పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లగా.. పురుషుల విభాగంలో యువ ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. పారిస్ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్లో గురువారం మూడో సీడ్ సింధు 21-19, 21-9తో లైన్ క్రిస్టోఫర్సెన్పై విజయం సాధించింది. ఆది నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన సింధు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్లలో విజృంభించింది. కండ్లు చెదిరే క్రాస్ కోర్ట్ షార్ట్లు పదునైన స్మాష్లతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసింది.
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో లక్ష్యసేన 21-17, 21-13తో లోహ్ కీన్ యే (సింగపూర్)పై విజయం సాధించాడు. 40 నిమిషాల్లో ముగిసిన పోరులో లక్ష్యసేన్ వరుస గేమ్ల్లో గెలుపొందాడు. మరో మ్యాచ్లో సమీర్ వర్మ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. గత వారం డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లోనూ సమీర్ గాయం కారణంగా తప్పుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-అశ్విని పొన్నప్ప జోడీ 21-15, 17-21, 19-21తో ప్రవీణ్ జోర్డాన్-మెలాతీ దైవా (ఇండోనేషియా) జంట చేతిలో ఓటమి పాలైంది.