హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ బిజినెస్ బ్యూరో): ఫ్రీడం పేరుతో వంటనూనెలు విక్రయిస్తున్న జెమినీ ఇడిబుల్ అండ్ ఫాట్స్ ఇండియా (జీఈఎఫ్).. తెలంగాణలో కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. రాష్ట్రంలో పామాయిల్ సాగు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక చొరవకు దన్నుగా తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ వంటనూనెల తయారీ ప్లాంట్ను నెలకొల్పుతున్నట్లు కంపెనీ ఎండీ ప్రదీప్ చౌదరీ ప్రకటించారు. రూ.500 కోట్ల పెట్టుబడితో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ వచ్చే రెండేండ్లలోగా అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. ఎక్కడ ఏర్పాటు చేసేదానిపై వచ్చే మూడు నెలల్లో స్పష్టత రానున్నదని, రోజుకు 1,000 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ యూనిట్తో 500 మందికి వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ప్రస్తుతం సంస్థకు కాకినాడ, కృష్ణపట్నం వద్ద ఉన్న మూడు ప్లాంట్ల కెపాసిటీ రోజుకు 2,615 మెట్రిక్ టన్నులు.
మరింత తగ్గనున్న వంటనూనెల ధరలు
రికార్డు స్థాయికి చేరుకున్న వంటనూనెల ధరలు గత నెల రోజులుగా తగ్గాయని, భవిష్యత్తులోనూ మరింత తగ్గే అవకాశం ఉన్నదని చౌదరి వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో టన్ను సన్ఫ్లవర్ ఆయిల్ ధర రికార్డు స్థాయి 2,400 డాలర్లు పలికిందని, ప్రస్తుతం ఇది 1,800 డాలర్లకు దిగిరావడంతో క్రమంగా దేశీయంగా ధరలు దిగొస్తున్నాయన్నారు. ఇప్పటికే సంస్థ లీటర్ ధరను రూ.230 నుంచి 200కి దించినట్లు, వచ్చే నెలల్లో మరింత తగ్గవచ్చన్నారు. ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు నిలిచిపోవడంతో రష్యా, అర్జేంటినా నుంచి పెరుగడమూ ధరలు తగ్గడానికి ప్రధాన కారణమన్నారు.
తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, ఒడిశాల్లో వంటనూనెలను విక్రయిస్తున్నది. వచ్చే ఏడాది తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లోకి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నది.
త్వరలో ఐపీవో ధరల శ్రేణి ప్రకటన. ఐపీవో ద్వారా రూ.2,500 కోట్ల వరకు నిధులను సేకరించాలని చూస్తున్నది.