సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 588 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఎస్సీఆర్ పరిధిలో సుమారు 6000 రూట్ కిలో మీటర్ల వరకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ విస్తరించి ఉందని, భారీ స్థాయిలో రైల్వే స్టేషన్లు డిజిటల్ హబ్గా మారుతున్నాయని చెప్పారు. 588 రైల్వే స్టేషన్లలో 30 మేజర్ నాన్ సబర్బన్ గ్రేడ్ స్టేషన్లు, 558 మధ్య తరహా, చిన్న తరహా స్టేషన్లు (నాన్ సబర్బన్, సబర్బన్ స్టేషన్లు) ఇందులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు కూడా స్వీకరించారు. ఈ క్రమంలో సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, నాందేడ్ వంటి స్టేషన్లలో ఏర్పాటు చేసిన నెట్వర్క్ అనుసంధానంతో అక్కడి ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎస్సీఆర్ అధికారులు తెలిపారు.