సంగారెడ్డి, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం పొందాలనుకునే గ్రామీణ, పేద ప్రజలకు న్యాయసేవాధికార సంస్థలు రాజమార్గంగా మారాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ అన్నారు. ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని మల్కాపూర్ చౌరస్తాలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో జిల్లా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, హైకోర్టు న్యాయమూర్తులు ఉజ్జల్ భూయాన్, టీ వినోద్కుమార్, షమీమ్ అక్తర్, అభిషేక్రెడ్డి, జీ శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ మాట్లాడుతూ.. దేశవ్యాప్త గణాంకాలను పరిశీలిస్తే కేవలం ఒక శాతం కేసులు మాత్రమే న్యాయసేవాధికార సంస్థ వద్దకు వస్తున్నాయని తెలిపారు. చాలామంది కక్షిదారులు ఉచిత న్యాయసేవల గురించి అవగాహన లేకపోవడంతో న్యాయ సేవాధికార సంస్థలను ఆశ్రయించడం లేదన్నారు. దీనిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
పుస్తకాల ఆవిష్కరణ..
న్యాయసేవాధికార సంస్థ తెలుగులో ముద్రించిన పుస్తకాలను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, హైకోర్టు సీజే జస్టిస్ సతీష్చంద్రశర్మ ఆవిష్కరించారు. అనంతరం వివిధ ప్రభుత్వశాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను వారు తిలకించారు. దివ్యాంగుల సంక్షేమశాఖ ద్వారా రూ.15.16 లక్షలు విలువగల రెట్రో ఫిట్టెడ్ స్కూటీలను లబ్ధిదారులకు అందజేశారు. అంధ విద్యార్థులకు రూ.1.20 లక్షల విలువ చేసే మూడు ల్యాప్టాప్లను అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రుణాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాపిరెడ్డి, తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ రేణుక, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, కలెక్టర్ హన్మంతరావు, ఎస్పీ రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.