నాగర్కర్నూల్, నవంబర్ 25: విద్యుత్తు చట్టాలు అమలైతే తెలంగాణలో ఉచిత కరెంటు ఇవ్వడం కష్టమేనని సినీనటుడు ఆర్ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశా రు. గురువారం ఆయన నాగర్కర్నూల్ పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి దేశవ్యాప్తంగా మృతి చెందిన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3 లక్షల పరిహారం ప్రకటించడాన్ని స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం, ఎఫ్సీఐ కొనాల్సిందేనని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. మోదీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్ చేతుల్లో పెట్టడం సరికాదన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపైనే తీసిన రైతన్న సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని నారాయణమూర్తి కోరారు.