చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 80,039 పోస్టులు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా తెలుపగా.. కొలువు కొట్టాలనే లక్ష్యంతో ఉద్యోగ అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. శిక్షణ తీసుకోవడానికి ఆర్థిక స్థోమతలేని అభ్యర్థులకు అండగా నిలిచేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా కదులు తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్ణయం మారుమూల ప్రాంతాలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి, సరైన గైడెన్స్ లేని వారికి వరంలా మారనుంది. కోచింగ్ కోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఏర్పాటు చేస్తుండడంతో నిరుద్యోగ యువతీయువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు ప్రకటించడం.. కోచింగ్ కూడా ఇప్పిస్తుండడంతో టీఆర్ఎస్ సర్కారుకు, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఆదిలాబాద్, మార్చి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ ఈ మూడింటిలో విజయం సాధించింది. ప్రాజెక్టులు నిండి కాలువల్లో నీరు గలగల ప్రవహిస్తున్నది. రాష్ట్ర బడ్జెట్లో అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయిస్తున్నది. నియామకాల విషయంలో రాష్ట్రం దేశంలోని మిగితా రాష్ర్టాలతో ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే 1.32 ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను కూడా రెగ్యూలరైజ్ చేయనున్నారు. ప్రభుత్వ ఇప్పటికే స్టడీ సర్కిళ్లు, లైబ్రరీల్లో వివిధ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ను అందుబాటులో ఉంచింది. గ్రంథాలయాలకు రోజూ వందలాది మంది విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3,919 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 1,192, మంచిర్యాలలో 1,025, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 825, నిర్మల్లో 876 ఉద్యోగాలు స్థానికులకు దక్కనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ అవకాశాలు రావడంతో విద్యార్థులు జాబ్ సాధించడమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు న్యాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ సహాయ, సహకారాలు అందించనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ సూచన మేరకు కేంద్రాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో విద్యార్థులకు అటెండర్ నుంచి గ్రూప్-1 ఉద్యోగాల వరకు జరిగే పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సబ్జెక్టులకు చెందిన నిపుణులు తరగతులు బోధించనున్నారు. వివిధ కేంద్రాల్లో భోజనం, వసతి సౌకర్యం కల్పించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగార్థులకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉచిత శిక్షణ తరగతులకు హాజరై ఉద్యోగాలు సాధించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. అల్లోల చిన్నమ్మ-నారాయణరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండగా, నోటిఫికేషన్ వెలువడిన వెంటనే తరగతులు ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 250 మందికి పలు ఉద్యోగాల కోసం శిక్షణ ఇచ్చామని చాలా మంది వివిధ ఉద్యోగాలు సాధించినట్లు వారు పేర్కొన్నారు.
మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం వెలువరించే అన్ని ఉద్యోగాల పోటీ పరీక్షలు రాసే వారికి శిక్షణతోపాటు వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు, స్వయం ఉపాధి లాంటి వాటిల్లో క్రమంగా శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా నుంచి మల్టీ జోనల్ వరకు నిర్వహించే అన్ని ఉద్యోగ పరీక్షలకు జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తాం. తరగతులతోపాటు భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తాం. వివిధ రంగాల్లో నిపుణుల ఆధ్వర్యంలో పలు అంశాలపై శిక్షణ ఇప్పిస్తాం. జిల్లాలో 1,192 ఉద్యోగాలు భర్తీ కానున్న నేపథ్యంలో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్
ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో ప్రిపరేషన్ అయ్యే అభ్యర్థులకు కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తాం. గతంలో కూడా కౌటాల, కాగజ్నగర్లలో 1,350 మందికి శిక్షణ ఇచ్చాం. ఈసారి జిల్లావ్యాప్తంగా అభ్యర్థులు శిక్షణ పొందవచ్చు. అందరికీ శిక్షణతో పాటు భోజన వసతి కల్పిస్తాం. ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పిస్తాం. ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే, సిర్పూర్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శాసనసభా వేదికగా 80,039 ఉద్యోగాల ప్రకటన చేశారు. ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయ్యే చాలా మంది అభ్యర్థులు కోచింగ్ తీసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడేవారికి అల్లోల చిన్నమ్మ-నారాయణరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తాం. అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే తర్ఫీదు ప్రారంభిస్తాం. ఉద్యోగ అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.
– అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మంత్రి.