హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం నుంచి అర్హులందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ వేయనున్నారు. రెండో డోస్ తీసుకొని ఆరు నెలలు పూర్తయిన వారికి ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ప్రికాషన్ డోస్ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు 60 ఏండ్లకు పైబడినవారికి, ఫ్రంట్లైన్ వారియర్లకే ఉచితంగా మూడో డోస్ వేస్తున్నారు. 18-59 ఏండ్ల మధ్యవారికి ప్రైవేట్ కేంద్రాల్లో అనుమతి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వారికి 75 రోజులపాటు ఉచిత పంపిణీ జరుగనున్నది. మొదట్లో కేంద్రం 60 ఏండ్లకు పైబడినవారికి, ఫ్రంట్లైన్ వర్కర్లకే ప్రికాషన్ డోస్ వేయాలని కేంద్రం నిర్ణయించింది. 18 ఏండ్లు పైబడినవారందరికీ ఉచితంగా మూడో డోస్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది.
గత ఏడాది డిసెంబర్ 2న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు రాష్ట్రమంత్రి లేఖ రాస్తూ అర్హులందరికీ ఉచితంగా బూస్టర్ ఇవ్వాలని కోరారు. థర్డ్ వేవ్ మొదలైన తర్వాత జనవరి 18న మళ్లీ లేఖ రాసినా కేంద్రం స్పందించలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి ప్రైవేట్లో బూస్టర్ డోస్కే అనుమతించటాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి హరీశ్రావు ఏప్రిల్ 11న లేఖ రాశారు. ప్రైవేట్ టీకాలతో ఆర్థికభారం అవుతుందని, చాలా మంది మూడో డోస్కు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే నిజమై లక్షలాది మంది ప్రికాషన్ డోస్కు దూరంగా ఉన్నారు. జూన్ 13న అన్నిరాష్ట్రాల అరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మరోసారి మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కృషి ఫలించి కేంద్రం ఉచితంగా బూస్డర్ డోస్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితులు, ఇతర రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతించాలని కేంద్రాన్ని పలుమార్లు కోరాం. ఆలస్యం జరిగినా.. ఇప్పటికైనా అనుమతించడం సంతోషకరం. ఈ నిర్ణయం తెలంగాణ ప్రజలతోపాటు యావత్ దేశానికి మేలు చేస్తుంది. అర్హులైన ప్రతి ఒకరికి బూస్టర్ డోసుఅందించేలా ఏర్పాట్లు చేయలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించాం. – హరీశ్రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి