సిటీబ్యూరో, జనవరి 25(నమస్తే తెలంగాణ) : ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి డిస్కౌంట్లో కార్లను ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తన వ్యాపార నిమిత్తం ఐదు కార్లను కొనుగోలు చేయాలనుకున్నది. డిస్కౌంట్లో పలు సైట్లను సంప్రదించింది. అబ్దుల్ రఫే అనే వ్యక్తి ఫోన్ ద్వారా రియల్ ఎస్టేట్ సంస్థను సంప్రదించాడు. కొత్త కార్లపై డిస్కౌంట్ ఇస్తానని దానికి సంబంధించిన కూపన్లు తన వద్ద ఉన్నాయని ఫోన్లో తెలిపాడు. అతడి మాటలు నమ్మిన రియల్ ఎస్టేట్ సంస్థ రూ.24.25 లక్షలు చెల్లించింది. ఆ తర్వాత అబ్దుల్ రఫే స్పందించలేదు. మోసపోయానని గుర్తించిన రియల్ ఎస్టేట్ సంస్థ రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు అబ్దుల్ రఫేను మంగళవారం అరెస్టు చేశారు.