మంచిర్యాల, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ)/శ్రీరాంపూర్: బొగ్గు గనిలో పైకప్పు కూలి నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో బుధవారం ఉదయం చోటుచేసుకొన్నది. గనిలోని 21 డిప్ 24 లెవల్, 3ఎస్పీ 2 సీం వద్ద గని పైకప్పు సపోర్టు పనులు చేస్తున్న టింబర్మెన్ బేర లచ్చయ్య (60), సపోర్ట్మెన్ వీ కృష్ణారెడ్డి (59), బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహరాజు (30), రెంక చంద్రశేఖర్ (30) మృతిచెందారు. ఉదయం 7 గంటలకు కార్మికులు విధుల్లోకి వెళ్లారు. 10 గంటల ప్రాంతం లో 14 మీటర్ల పొడవు, 10 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్ల మందం తో ఉన్న బండను తొలగిస్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకున్నది.
10:30 గంటల ప్రాంతంలో ప్రమాద సమాచారం తెలుసుకున్న అధికారులు.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందం సభ్యులు సహాయక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మొదటి మృతదేహాన్ని వెలికితీశారు. రాత్రి 9 గంటల వరకు నలుగురి మృతదేహాలను బయటకు తెచ్చారు. గని ప్రమాద స్థలాన్ని బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జనరల్ మేనేజర్ బల్లారి శ్రీనివాస్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గోసిక మల్లేశం సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కార్మికుల ఆందోళనల నేపథ్యంలో పోలీసుల సాయంతో మృతదేహాలను శ్రీరాంపూర్ ఏరియా దవాఖానకు తరలించారు.
గని ప్రమాదంలో నలుగురు కార్మికుల మృతిపట్ల మంత్రులు టీ హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
నలుగురి కార్మికుల మృతిపట్ల టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా నిలుస్తామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. టీబీజీకేఎస్ నేతలు వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, కే మల్లయ్య తదితరులు కార్మికుల మృతికి నివాళులర్పించారు.
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): గని ప్రమాదంలో నలుగురు కార్మికుల మృతిపట్ల సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతంకాకుండా చూడాలన్నారు. మృతిచెందిన కార్మిక కుటుంబాలకు కంపెనీ అండగా ఉంటుందని, కంపెనీ తరఫున చెల్లించాల్సిన సొమ్మును తక్షణమే అందిస్తామని తెలిపారు. చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి వారు కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. యాజమాన్యం తరఫున చెల్లించే మ్యాచింగ్ గ్రాంట్, గ్రాట్యుటీ తదితర చెల్లింపులన్నీ కలిసి సుమారు రూ.70 లక్షల నుంచి రూ. కోటి వరకు అందజేయనున్నట్టు వెల్లడించారు.