వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో సాగుకు కరెంట్ సరఫరా సమస్యతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ఎలక్ట్రిసిటీ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మూడు రోజుల క్రితం గ్రామంలో పంటలకు అసలు కరెంట్ లేదని, అలాగే గత రెండు రోజులుగా ఒక వైపు ఆరు గంటలు మరో వైపు ఆరు గంటలు కరెంట్ ఇస్తున్నారని, దీనివల్ల పంటలకు నీరు సరిగ్గా అందక మొక్కజొన్న పంట ఎండిపోయే ప్రమాదం ఉంది అని ఎమ్మెల్యే ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లారు.
రైతులందరు సబ్ స్టేషన్ వెళ్లి అధికారులను అడిగితే లో ఓల్టేజ్ సమస్య అని, 3 కెపాసిటర్ సేల్స్, 4 బ్యాటరీలు ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారన్నారు. వెంటనే మెటీరియల్ సప్లై చేసి కరెంట్ సమస్య త్వరితగతిన పరిష్కరించి రైతులకు కరెంట్ ఇబ్బంది లేకుండా చూడాలని ఎస్ఈని ఎమ్మెల్యే ఆదేశించారు.