జైపూర్ : జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి కేంద్రంపై మాటల దాడి చేశారు. పుల్వామా దాడిలో వీర మరణం పొందిన సైనికుల త్యాగాన్ని 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రచారాస్త్రంగా వాడుకున్నారని విమర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిగి ఉంటే, అప్పటి రక్షణ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చేదన్నారు.
రాజస్థాన్లోని బన్సూర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో సత్యపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ ఎన్నికల సమరాంగణం మన సైనికుల మృత దేహాల మీద నడిచింది. పుల్వామా ఘటనపై విచారణ జరిగి ఉంటే చాలామంది అధికారులు జైలుకెళ్లేవారు. విషయం పెద్ద వివాదమై ఉండేది’ అని మాలిక్ అన్నారు. అదానీ సంపద పెరగడానికి ప్రధాని మోదీ సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
గోవా సీఎం అవినీతి గురించి తాను ఫిర్యాదు చేస్తే తనను గవర్నర్ పదవి నుంచి తొలగించారని, సీఎంను మాత్రం అలాగే కొనసాగించారన్నారు. ‘వాళ్లు తమ ముఖ్యమంత్రుల నుంచి దోచుకొన్నదాన్ని అదానీకి ఇస్తారు. ఆ డబ్బుతో ఆయన వ్యాపారం చేస్తారు. అది తన డబ్బేనని ఆయన భావిస్తారు’ అని మాలిక్ అన్నారు. బీజేపీకి మరోసారి ఓటేస్తే ఇకపై ఓటేసే అవకాశమే లేకుండా చేస్తారని ఆయన హెచ్చరించారు.