సహారన్పూర్: కరోనా వల్ల కొన్ని మంచి పనులు జరుగుతున్నాయని అనుకోవాలా? వరుసగా రెండో ఏడాది సహారన్పూర్ పౌరులకు సుదూర హిమాలయాలు తళతళలాడుతూ దర్శనమిచ్చాయి. పెరుగుతున్న కాలుష్యం కారణంగా మంచుకొండల వీక్షణం కళ తగ్గిపోయి చాన్నాళ్లయింది. అయితే వరుసగా రెండో ఏడాది లాక్డౌన్ నిబంధనల కారణంగా కాలుష్యం తగ్గిపోయింది. దాంతో హిమాలయ దృశ్యానికి పాతవైభవం వచ్చింది. ఆ ధగధగలు, నిగనిగలు చూసి పట్టణ పౌరులు పులకించిపోయారు. చాలామంది ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. “ఇదొక అపురూప దృశ్యం. రెండు రోజులు వర్షాలు కురిసి మబ్బులు తొలగిపోయిన తర్వాత ఉత్తర దిశగా చూస్తే హిమాలయాలు స్పష్టంగా కనిపించాయి. 30-40 ఏళ్ల క్రితం వరకూ ఇలాగే కనిపించేవి. కానీ కాలుష్యం పెరుగుతున్నకొద్దీ అవి కనిపించడమే అరుదైపోయింది. హిమశిఖరాలు కనిపించేసరికి మాలాంటి అమెచూర్ ఫొటోగ్రాఫర్లకు ప్రాణం లేచి వచ్చింది” అని సహారన్పూర్లో వైద్యవృత్తి నిర్వహిస్తున్న డాక్టర్ వివేక్ బెనర్జీ అన్నారు. ఆయన తీసిన హిమాలయాల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తారంగా షేర్ అవుతున్నాయి. యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ కూడా డాక్టర్ బెనర్జీ ఫొటోలు ట్విట్టర్లో షేర్ చేశారు. తౌక్టే తుఫాను వల్ల రెండు రోజులు భారీవానలు కురిసి గాలిలో కాలుష్యం, తేమ, పొగలు కొట్టుకుపోవడం వల్ల ఆ అద్భుత దృశ్యం ఆవిష్కరించబడిందని, 150 కిలోమీటర్ల దూరంలోని హిమాలయాలు నేత్రపర్వంగా కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.