మియాపూర్ : నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో పూర్తి స్థాయి మౌలిక వసతులను కల్పించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. బస్తీ కాలనీ తేడా లేకుండా సమాన స్థాయిలో వాటిని అభివృద్ధి పథంలో నడిపించటమే తన ధ్యేయమన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ పరిధిలోని తులసీనగర్ నుంచి హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీ హాల్ వరకు, హెచ్ఎంటీ శాతవాహన కాలనీల్లో రూ. 72.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చి తగు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులను చేపడుతున్నదన్నదన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ గోవర్థన్, ఏఈ రాజీవ్, మహదేవ్, పార్టీ డివిజన్ నేతలు, మహిళా నేతలు, కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
స్వచ్ఛ ఆటోల ప్రారంభం
డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ కాలనీకి కేటాయించబడ్డ రెండు స్వచ్ఛ ఆటోలను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి విప్ గాంధీ ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి తడి పొడి చెత్తను వేరుగా సేకరించాలని, ప్రజలు సైతం రహదారులపై చెత్త వేయవద్దని, ఆటోలకు అందించాలని గాంధీ పిలుపునిచ్చారు.
హెచ్ఎంటీ హిల్స్లోని రామాలయంలో ఈ సందర్భంగా విప్ గాంధీ, కార్పొరేటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మన ఊరు మన బడి కార్యక్రమంపై సమీక్ష
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో మన ఊరు మన బడి కార్యక్రమంపై ఎంఈవో ఆంజనేయులు, డీఈ దానయ్య, ప్రధానోపాధ్యాయులతో విప్ గాంధీ తన నివాసంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయి వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదన్నారు.
నియోజవకర్గంలో మొత్తం 31 పాఠశాలల్లో వసతుల నిమిత్తం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని, నిధుల మంజూరు లభించగానే వసతుల పనులను చేపడతామన్నారు. వనరులను సద్వినియోగ పరిచి పాఠశాలలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని విప్ గాంధీ సూచించారు.