హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఇకపై మొదట ప్రధానోపాధ్యాయులు రుచి చూడాల్సిందే. భోజనం బాగుందని వారికి అనిపిస్తేనే ఆపై పిల్లలకు వడ్డించాలి. ఈ మేరకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. అధికారులు త్వరలోనే డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. వారి అనుమతితో తుది మార్గదర్శకాలను విడుదలచేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇటీవల కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం గతంలోనే కొన్ని మౌఖిక ఆదేశాలివ్వగా.. తాజాగా మార్గదర్శకాలను కూడా సిద్ధం చేస్తున్నారు.
మధ్యాహ్న భోజన పథకం సమర్థంగా అమలయ్యేలా హెచ్ఎంలు పర్యవేక్షించాలి.
భోజనం తయారీకి నాణ్యమైన బియ్యం, వంట సామాగ్రిని వినియోగిస్తున్నారో లేదో చూడాలి.
కిచెన్, వడ్డించే ప్రాంతాల్లో శుచి, శుభ్రత ఉండేలా చూడాలి. వంటగదులు, తినే ప్రాంతాల్లో భౌతికదూరం పాటించడం, పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
విద్యార్థులంతా ఒకేసారి కాకుండా విడతలవారీగా భోజనాన్ని తీసుకునేలా ఏర్పాట్లు చేయాలి.
మామడ, నవంబర్ 5: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్నాక విద్యార్థులకు వాంతులయ్యాయి. ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారంతో వైద్యసిబ్బంది పాఠశాలకు చేరుకొని చికిత్స అందించారు. 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే అంబులెన్సులో మామడ పీహెచ్సీకి తరలించారు. ఈ ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్ఎం వినోద్కుమార్ను డీఈవో సస్పెండ్ చేశారు. భోజన నిర్వాహకులను తొలగించారు.