హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో గోదావరి ఎగువన భారీ వర్షాలు కురిశాయి. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం డ్యామ్కు 24,150 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. దీంతో అధికారులు 8 ఎనిమిది గేట్లు ఎత్తి 24,960 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 7,500 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టంతో కళకళలాడుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు కాగా.. గరిష్ఠ నీటి నిల్వ 90 టీఎంసీలు. ఇదిలా ఉండగా.. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి వరద వస్తోంది. ప్రస్తుతం డ్యామ్కు 9,953 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. నాలుగు గేట్లు ఎత్తి 25,278 క్యూసెక్కులు దిగువకు వదిలారు. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 697.10 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. ప్రాజెక్టులో ప్రస్తుతం 6.86 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది.