అమరావతి : సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు ( Seven fishermen ) 23 రోజుల తరువాత సురక్షితంగా స్వస్థలాలకు ( Home town ) చేరుకున్నారు. వారికి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ( MLA Konda Babu ), ఎమ్మెల్సీ రాజశేఖర్( MLC Rajashekar ) , కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. తమవారిని చూసుకుని కుటుంబ సభ్యులు వారిని హత్తుకుని బోరున విలపించారు. వారు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఈనెల 3న వేటకు అల్లవరం మండలం ఓడలరేవు నుంచి ఏడుగురు బోటులో చేపల వేటకు బయలు దేరారు. వారంతా ఈనెల 10వ తేదీని తిరిగి రావాల్సి ఉండగా అప్పటి నుంచి అధికారులకు , కుటుంబ సభ్యులకు సమాచారం అందకపోవడంతో గల్లంతైనట్లు కేసు నమోదు చేసి ఆచూకీ కోసం అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి.
ఈ దశలో గత గురువారం ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్లో ని కోల్కత్తాలో సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని రాష్ట్ర మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందింది. బోటు ఇంజిన్లో సమస్యలు తలెత్తడంతో తిరిగి రాలేకపోయామని, తెరచాప వేసుకుని పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టి వద్ద కు చేరుకున్నామని బాధితులు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల జాడను తెలుసుకున్న కోనసీమ జిల్లా మత్స్యశాఖ అధికారులు, పోలీసుల సహాయంతో కోల్కత్తా నుంచి తిరిగి క్షేమంగా వారి స్వస్థలాలైన ఓడల రేవుకు తీసుకోచ్చారు.