వెంకటాపూర్, ఏప్రిల్ 17 : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, నేడు తొలిసారిగా ప్రపంచ వారసత్వ ఉత్సవాలను వైభవంగా జరుపుకొంటున్నది. ‘శిల్పం వర్ణం కృష్ణం, సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ ఆఫ్ రామప్ప’ థీమ్తో నిర్వహించే వేడుకలకు అధికారయంత్రాంగం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇదివరకు ఎన్నో ఉత్సవాలు జరిగినా యునెస్కో గుర్తింపు తర్వాత ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనుండగా, మంత్రులు శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రామప్పలో ‘ప్రపంచ పండుగ’కు కవులు, కళాకారులు, వేలాది మంది ప్రజలు తరలిరానున్నారు.
ప్రపంచ వారసత్వ దినోత్సవ వేళ ‘శిల్పం వర్ణం కృష్ణం’ పేరిట ఉత్సవాలకు ప్రఖ్యాత రామప్ప ఆలయం ముస్తాబైంది. యునెస్కో గుర్తింపు పొందిన పాలంపేటలోని రామలింగేశ్వర స్వామి ఆలయం మంగళవారం సాంస్కృతిక ప్రదర్శనలతో మార్మోగనుంది. వివిధ ప్రాంతాల నుంచి వందలాది కళాకారులు తరలిరానుండగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది.
ఈమేరకు జిల్లా అదనపు కలెక్టర్ వై.వీ గణేశ్ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఉత్సవాలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శా ఖల మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. సినీ ప్రముఖు లు, కళాకారులు ప్రఖ్యాత డ్రమ్స్ కళాకారుడు శివమ ణి, బలగం చిత్ర యూనిట్ బృందం, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అరబ్సీ ఇన్స్టిట్యూట్ వయోలిన్, పేరిణి నృత్యం, రావణ నాటకం శ్రావ్య మానసతో పాటు 300మంది కళాకారుల ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. రామప్ప ఆలయానికి అధిక సంఖ్యలో పాల్గొనేందుకు హనుమకొండ, ములుగు నుంచి రవాణా సౌకర్యాలు ఏర్పాటుచేశామని తెలిపారు. ఆర్డీవో రమాదేవి, కలెక్టరేట్ ఏవో విజయభాస్కర్, ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేశ్, డీసీవో సర్దార్సింగ్, డీడబ్లూఓ ప్రేమలత, జిల్లా మత్సశాఖ అధికారి శ్రీపతి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్, తహసీల్దార్ మంజుల, డీటీవో శివాజి ఉన్నారు. ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్పీ గౌస్ ఆలం, ఓఎస్డీ అశోక్కుమార్లు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. వారితో డీసీఆర్బీ డీఎస్పీ సుభాష్బా బు, సీఐ రంజిత్కుమార్, ఎస్సై తాజొద్దీన్ ఉన్నారు.
గతంలో రామప్పగుడి శిల్పాలపై నటరాజ రామకృష్ణ పరిశోధన చేసి, పేరిణి శివతాండవాన్ని వెలుగులోకి తేగా ఇప్పుడు ఇక్కడి నాట్యశిల్పాలు, పురాణగాథలు అన్నీ భరతముని రచించిన నాట్యశాస్త్రం ప్రకారమే చెక్కారని వైజాగ్కు చెందిన డ్యాన్స్ డైరెక్టర్, శ్రీనిర్మల నృత్య నికేతన్ ప్రిన్సిపాల్ విజయజ్యోతి చెబుతున్నారు. ఈ మేరకు ఆమె ‘రామప్ప ఆలయం నాట్యశాస్త్రం’ అనే పుస్తకాన్ని రాశారు. పాలంపేటలోనేడు జరిగే వారసత్వ ఉత్సవాల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. రామప్ప ఆలయాన్ని చూసి, కాకతీయుల వైభవాన్ని తెలుసుకొని ఏడాదిపాటు పరిశోధించి, ఆలయంపై డాక్యుమెంటరీని రూపొందించడంతో పాటు పుస్తకం రాసినట్లు తెలిపారు. గతంలో రామప్ప ఆలయం గురించి, పేరిణి నృత్యం గురించి గతంలో చదివానని, రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ఇక్కడ నృత్య శిల్పాలను చూసేందుకు వచ్చానని, నాట్యశాస్త్రం ప్రకారమే ఇక్కడ శిల్పాలను చెక్కారని గుర్తించానని వివరించారు.
మరింత పరిశోధన చేసి 2022, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామప్పలో నృత్య ప్రదర్శన ఇచ్చామని, నాట్య భంగిమలు, పురాణగాథలపై తన శిష్యబృందంతో ప్రదర్శింపజేసి, తర్వాత తరాలకు తెలిసేలా డాక్యుమెంటరీని తయారు చేశానని, పుస్తకం కూడా రాశానని చెప్పారు. గర్భగుడిలో సభాపతి నిర్ణయం, బయటిగోడలపై సభాపతి విజయగాథలు, రంగమండపం శాంతికోసం, రక్షణగా అష్టదిక్పాలకులను చెక్కడం, మొట్టమొదటి రూపకంగా క్షీరసాగరమథనం, త్రిపురదాహం, కోలాటాలు, నృత్యభంగిమలు ఇలా అన్నీ నాట్యశాస్త్రం ప్రకారమే చెక్కారని తెలిపారు. తాను 40 ఏండ్లుగానృత్య అధ్యాపకురాలిగా ఎంతో మందికి కూచిపూడి నృత్యాన్ని నేర్పిస్తూ దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి 12 జాతీయ అవార్డులు సాధించానని, కూచిపూడిలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు అందిస్తూ నృత్యం నేర్పిస్తున్నానని చెప్పారు. నృత్యానికి సంబంధించిన గ్రంథాలన్నీ గ్రాంధికంలోనే ఉండగా పిల్లలకు అర్థమయ్యేలా వ్యవహారిక భాషలో బాలనాట్యశాస్త్రం, బాలనర్తనం, నృత్తకారణం విన్యాసం, హస్తాభినయం పుస్తకాలను రచించానని వివరించారు.
ఆనందంగా ఉంది : శివమణి
‘అందరికీ ప్రపంచ వారసత్వ దినోత్సవ శుభాకాంక్షలు. రామప్పలో జరుగుతున్న వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది’ అని ప్రముఖ వా యిద్య కళాకారుడు శివమణి అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బృందంతో కలిసి వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం రాత్రి ఆయన రామప్పకు చేరుకొని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరుడిని దర్శించుకొని ఆలయంలో ధ్యానం చేశారు.
రామప్పకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హనుమకొండ చౌరస్తా : వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా హనుమకొండ నుంచి రామప్పకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత తెలిపారు. కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయ దర్శనం, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించే ప్రయాణికులు బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, హనుమకొండ-రామప్పకు పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.60, ములుగు నుంచి రామప్పకు పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.30 టికెట్ ఉంటుందన్నారు.
జిగేల్ జిగేల్
ఉత్సవాల సందర్భంగా రామప్ప జిగేల్మంటోంది. రంగురంగుల విద్యుద్దీపకాంతులతో మెరిసిపోతోంది. అల్లంత దూరం కనిపించే భారీ లైటింగ్ సిస్టమ్తో ఆ ప్రాంగణమంతా మిరుమిట్లు గొలుపుతోంది. కళాకారులు ప్రదర్శించే వేదిక వద్ద భారీ స్టేజీ సెట్టింగ్తో పాటు సౌండ్ సిస్టమ్ ఏర్పాటుచేశారు. అలాగే వీఐపీలు సహా ఇతర ప్రేక్షకులు వీక్షించేందుకు వీలుగా వేసిన సీటింగ్ ఏర్పాట్లు అదరహో అనిపించేలా ఉన్నాయి.