న్యూఢిల్లీ : ఢిల్లీలోని నరేలా పారిశ్రామిక ప్రాంతంలో మూడంతస్తుల భవనంలోని ఫుట్వేర్ తయారీ ఫ్యాక్టరీలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం సమాచారం అందిన వెంటనే అధికారులు అప్రమత్తమై ఘటనా ప్రాంతానికి అగ్నిమాపక యంత్రాలను తరలించారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఘటనా ప్రాంతంలో ఏడు అగ్నిమాపక యంత్రాలతో పాటు సిబ్బంది శ్రమిస్తున్నారని అధికారులు తెలిపారు.
పరిసర ప్రాంతంలోని కంపెనీలకు మంటలు విస్తరించకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం అగ్నిప్రమాదానికి కారణం వంటి మరిన్ని వివరాలు వెల్లడవుతాయని చెబుతున్నారు.