అహ్మదాబాద్: ఒక ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం (fire broke out) సంభవించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 125 మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు షాహిబాగ్ ప్రాంతంలోని పది అంతస్తులున్న రాజస్థాన్ ఆసుపత్రి బేస్మెంట్లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ అగ్నిప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది 12 అగ్నిమాపక వాహనాలతో అక్కడకు చేరుకున్నారు. ఆసుపత్రి బేస్మెంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేశారు.
కాగా, ఆ ఆసుపత్రి బేస్మెంట్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉంచిన వస్తువుల నుంచి పొగలు, మంటలు వచ్చినట్టు చెప్పారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు 125 మంది రోగులను ఆసుపత్రి నుంచి ఖాళీ చేయించినట్టు తెలిపారు. నగరంలోని పలు ఆసుపత్రులకు ఆ రోగులను తరలించినట్టు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని పోలీస్ అధికారి తెలిపారు. మంటలు చెలరేగడానికి కారణం ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.