హైదరాబాద్: సికింద్రాబాద్లోని కార్ఖానాలో (Karkhana) అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కార్ఖానాలోని ఓ కిరాణం స్టోర్లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి స్టోర్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, కిరాణా దుకాణం పై అంతస్థులో బాలిక హాస్టల్ ఉన్నది. దట్టంగా పొగలు వ్యాపించడంతో విద్యార్థినిలు ఆందోళనకు గురయ్యారు. బయటికి రావడానికి ఇబ్బంది పడటంతో పోలీసులు వారిని సురక్షితంగా వెళుపలికి తీసుకొచ్చారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.