యాదాద్రి : నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మాణ దశలో ఉన్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్లోని యూనిట్-3లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజినీర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యూనిట్-3 పరిధిలోని టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంప్ వద్ద లూబ్రికేషన్ ఆయిల్ లీక్ కావడమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అధికారులు అంచనా వేస్తున్నారు.
చమురు లీకేజీ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి, ప్లాంట్ ప్రాంగణమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో పంప్ ఏరియాలోని కంట్రోల్ కేబుళ్లు, కొన్ని కీలకమైన వాల్వ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ప్లాంట్ సిబ్బంది, అక్కడే ఉన్న అగ్నిమాపక యంత్రాలు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. దాంతో బాయిలర్లు, మెయిన్ టర్బైన్లు వంటి ప్రధాన యంత్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న తెలంగాణ జెన్కో ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నష్టాన్ని అంచనా వేయడంతో పాటు, ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి అంతర్గత విచారణకు ఆదేశించారు.