ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 23: తన సర్టిఫికెట్లు తీసుకొని వెళ్లేందుకు వచ్చిన విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. అకారణంగా ఓయూ భద్రతా సిబ్బంది ఆమెకు ఫైన్ వేయడం విమర్శలకు తావిచ్చింది. ఫైన్ రశీదు సోషల్ మీడియాలో వైరల్గా మారగా, మీడియా ప్రతినిధులకు సమాచారం అందడంతో వారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్వో) గణపతి జాదవ్ను వివరణ కోరారు. అయితే తాను ఫైన్ వేయొద్దని చెప్పానని, అయినా వేశారని చెప్పడం విశేషం. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు… ఓయూలో ఇటీవలే తన చదువు పూర్తి చేసుకుని అమ్మాయి, తన స్నేహితుడితో కలిసి వర్సిటీకి వచ్చి సర్టిఫికెట్లు తీసుకుని తిరుగు ప్రయాణమైంది.
వర్క్షాపు నుంచి హబ్సీగూడ వెళ్లే దారిలో వర్సిటీ ఉన్నతాధికారుల కాన్వాయ్ ఎదురైంది. చిన్నదారి కావడంతో ఆమె తన ద్విచక్రవాహనాన్ని పక్కకు తిప్పింది. అంతలో బండి పొదల్లోకి వెళ్తుండగా, వెనకాల ఉన్న స్నేహితుడు ఆపివేశాడు. అది చూసిన సదరు ఉన్నతాధికారి వారెవరో వాకబు చేయాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించగా, వారి వివరాలు తీసుకుని సీఎస్వోకు చెప్పారు. దీంతో ఆయన వదిలివేయాల్సిందిగా సూచించారు. అయినా వినని సెక్యూరిటీ సిబ్బంది ఆ అమ్మాయికి రూ.500 జరిమానా వేశారు. ఆమె ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించారు. జరిమానా రశీదు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఆ ఫైన్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని సిబ్బందికి సీఎస్వో ఆదేశాలు జారీ చేశారు.