హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): చేనేతపై విధించిన జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని, అప్పటి వరకు తమ పోరాటం ఆగదని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాని మోదీకి భారీ వస్త్రంపై లేఖ రాసింది. మహారాష్ట్రలోని రాలేగావ్సిద్ధిలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేను చేనేత విభాగం అధ్యక్షుడు యార్రమాద వెంకన్న ఆధ్వర్యంలో సంఘం నేతలు శుక్రవారం కలిశారు. జీఎస్టీ తొలగింపు కోసం చేనేత సంఘాలు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. త్వరలో ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అందుకు అన్నాహజారే సానుకూలంగా స్పందించారు. ప్రధాని మోదీకి రాసిన వస్త్ర లేఖపై తొలిసంతకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేనివిధంగా చేనేత వస్ర్తాలపై 2017లో కేంద్రం 5 శాతం జీఎస్టీని పెంచిందని చెప్పారు. దీన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్రోద్యమంలో గాంధీ చరఖాను ఆయుధంగా మలిచారని, అలాంటి చేనేత వస్త్రంపై ఎలాంటి పన్నులు ఉండకూడదని అన్నారు. అనంతరం యార్రమాద వెంకన్న మాట్లాడుతూ.. ప్రధానికి రాసిన లేఖపై ప్రముఖ సామాజిక ఉద్యమకారులు, వివిధ రాష్ర్టాల పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంతకాలు చేయిస్తామని తెలిపారు. అన్నాహజారేను కలిసిన వారిలో చేనేత విభాగం ఉపాధ్యక్షుడు కండగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, ప్రతినిధులు మిట్టపల్లి చంద్రకాంత్, చిట్యాల్ మహేశ్, బుస సురేశ్, వల్లకాటి సంజయ్ తదితరులు ఉన్నారు.