హైదరాబాద్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ)/హిమాయత్నగర్: వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపుదలకు వ్యతిరేకంగా జనవరి 5 నుంచి దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించనున్నట్టు అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం చైర్మన్ యర్రమాద వెంకన్న తెలిపారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని సం ఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రోజుకొక రాష్ట్రంలో హ్యాండ్లూమ్ మార్చ్ నిర్వహిస్తామ ని పేర్కొన్నారు. జనవరి 5న తెలంగాణ, 7న మహారాష్ట్ర, 8న గుజరాత్, 11న ఆంధ్రప్రదేశ్, 23న కేరళ, 27న కర్ణాటక రాష్ర్టాల్లోని ప్రతి గ్రామంలో హ్యాండ్లూ మ్ మార్చ్ నిర్వహిస్తామన్నారు.
ఆయా తేదీల్లో ఒకే సమయంలో గాంధీ టోపీలు ధరించి, మెడలో నూలు దండలు, చేతిలో రాట్నం జెండా పట్టుకొని ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. జీరో జీఎస్టీ ఆన్ హ్యాండ్లూ మ్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేనేతను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి ఆ రంగానికి తీరని ద్రోహం చేస్తున్నదని విమర్శించారు. చేనేతపై జీఎస్టీని 5 నుంచి 12శాతానికి పెంచడం వల్ల 32లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం జీఎస్టీని ఉపసంహరించుకొనే వరకూ పోరాడుతామని చెప్పారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు కందగట్లస్వామి, అవ్వారి భాస్కర్, దుశ్యంతల పాల్గొన్నారు.
మార్చ్లో పాల్గొంటాం: ఎల్ రమణ
పద్మశాలీ సంఘం జనవరి 5న తలపెట్టిన హ్యాండ్లూమ్ మార్చ్కు మద్దతు ఇచ్చి, పాల్గొంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ తెలిపారు. బుధవారం ఆయన నారాయణగూడలోని పద్మశాలీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమపై జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీఎస్టీ పెంపుదల వల్ల చేనేత వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం వైఖరి మారకపోతే ఉధృతమైన పోరాటాలు చేస్తామని రమణ హెచ్చరించారు.