న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించేవారి సంఖ్య భారీగా పెరుగుతున్నారు. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో వాహన కొనుగోలుదారులు ఈవీలపై మక్కువ చూపుతున్నారు. దీంతో చార్జింగ్ స్టేషన్లకు డిమాండ్ నెలకొన్నది. ఇప్పటికే పలు సంస్థలు వేలాది చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా..తాజాగా ఇదే జాబితాలోకి హీరో ఎలక్ట్రిక్ చేరింది. బోల్ట్తో కలిసి దేశవ్యాప్తంగా వచ్చే ఏడాదికాలంలో 50 వేల చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పబోతున్నది. ఇందుకోసం ఇరు సంస్థలు బుధవారం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా హీరోకి చెందిన 750 టచ్పాయింట్లలో చార్జింగ్ స్టేషన్లను బోల్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తద్వారా 4.5 లక్షల మంది వినియోగదారులు ప్రయోజనం పొందనున్నారు. కార్బన్ రహిత, ఈవీల వినియోగాన్ని పెంపొందించడంలో భాగంగా బలమైన చార్జింగ్ ఎకోసిస్టాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ తెలిపారు. చార్జింగ్ స్టేషన్లలో అన్ని రకాల సేవలు అందించడానికి ప్రత్యేకంగా మొబైల్ యాప్, వెబ్సైట్ను కూడా హీరో తీర్చిదిద్దింది.