కార్వాన్, ఫిబ్రవరి11: ఓ ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు చిన్నారులు గొడవపడటంతో ఓ చిన్నారికి తల పగిలిన ఘటన కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. జియాగూడాలోని జోషిగల్లీలో క్రిష్ణవేణి టాలెంట్ పాఠశాలలో దుర్గానగర్కు చెందిన లక్ష్మీకాంత్చారి కుమారుడు ప్రణయ్చారి ఐదో తరగతి చదువుతున్నాడు. ప్రయణ్చారిపై తన తోటి విద్యార్థి దాడి చేయడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ప్రణయ్ తల్లిదండ్రులు వెంటనే తమ కుమారుడిని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించి చికిత్స చేయించారు.
ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. పాఠశాలలో చిన్నారులపై దృష్టి పెట్టాల్సిన పాఠశాల యాజమాన్యం విద్యార్థులు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో సౌకర్యాల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు గుంజే యాజమాన్యం తమ విద్యార్థులపై శ్రద్ధ వహించకపోవడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అటు విద్యాశాఖ అధికారులు గాని, ఇటు పోలీస్శాఖ గాని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.