ముంబై, ఫిబ్రవరి 11: అడుగుపెట్టగానే సంగీతాన్ని వినిపించే రోడ్డును భారత దేశంలో తొలిసారిగా ముంబైలో అధికారులు తయారు చేశారు. నారిమన్ పాయింట్ నుంచి వర్లీకి వెళ్లే మార్గంలో 700 మీటర్ల పాటు ఏర్పాటు చేసిన మ్యూజిక్ రోడ్ను రూ. 6.21 కోట్లతో నిర్మించగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం దీనిని ప్రారంభించారు.
దీనిపైకి అడుగుపెట్టిన వెంటనే ఆస్కార్ అవార్డు పొందిన స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలోని ‘జయహో’ అన్న గీతం వినిపిస్తుంది. తొలుత ఈ తరహా సంగీత రోడ్లు జపాన్లో 2007లో ఏర్పాటు చేయగా, తర్వాత హంగేరి, దక్షిణ కొరియా, యూఏఈలలో నిర్మించారు. ఈ పాటను దేశానికి అంకితం చేయడానికి, ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ఈ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. హంగేరియన్ టెక్నాలజీ సాయంతో సంగీత స్ట్రిప్లను ఏర్పాటు చేసి పాటను వినిపించే ఏర్పాటు చేసినట్టు వారు చెప్పారు.