హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): సోలార్ యూనిట్లు, జనరిక్ మందుల షాపులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో స్త్రీనిధి ద్వారా స్వయం స్వహాయక సంఘాల్లోని సభ్యులకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్న వారికి రుణా లు ఇచ్చి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. జనరిక్ మెడికల్ షాపు పెట్టేందుకు రూ.3 లక్షల సాయాన్ని అందిస్తారు. దీని ద్వారా మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటుగా ప్రజలకు తక్కువ ధరలకే మందులు లభిస్తాయి. ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 150 షాపులకు అవసరమైన రుణాన్ని అందిస్తారు.
దీని కోసం ఇప్పటికే 50 మందికి శిక్షణ ఇచ్చారు. త్వరలోనే వారికి రుణాలు అందిస్తారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా గృహాలపై సోలార్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టీఎస్ రెడ్కో సబ్సిడీ అందిస్తుంది. ఒక్కో ఇంటికి మూడు కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన యూనిట్లకు సబ్సిడీని అందిస్తారు. సబ్సిడీ మొత్తం పోను మిగిలిన మొత్తాన్ని యజమాని సొంతంగా భరించాలి లేదా బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాల్సి ఉంటుంది. సబ్సిడీ కాకుండా మిగిలిన మొత్తాన్ని స్త్రీనిధి రుణంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందిస్తుంది. ఒక్కో యూనిట్కు రూ.2 లక్షల వరకు రు ణం ఇవ్వాలని నిర్ణయించారు.
దీనిలో భాగం గా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో ఒక్కో జిల్లాలో 100 యూనిట్స్కు అవసరమైన మొత్తాన్ని రుణంగా అందిస్తారు. దీనిపై త్వరలో టీఎస్ రెడ్కోతో ఒప్పందం చేసుకోనున్నారు. స్త్రీనిధి కార్యకలాపాలపై మహిళా స్వయం సహాయక సంఘాల అభిప్రాయాలను తీసుకోవడానికి మండల, జిల్లా స్థాయి లో కూడా కమిటీలను ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకొని ఆ మొత్తాన్ని రెగ్యులర్గా తిరిగి చెల్లిస్తున్న స్వ యం సహాయక సంఘాలకు 0.50 శాతం వడ్డీని తిరిగి వారికి చెల్లించాలని స్త్రీనిధి నిర్ణయించింది. గ్రామ సమాఖ్యల ద్వారా కాకుండా ఎస్హెచ్జీ స్థాయిలోనే రుణ చెల్లింపులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి ద్వారా రూ.3060 కోట్ల రుణాన్ని అందించారు. స్త్రీనిధి ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3700 కోట్ల రుణాన్ని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇస్తారు. దీనిలో రూ.2800 కోట్లు సెర్ప్ పరిధిలోని సంఘాలకు, రూ.900 కోట్లు మెప్మా పరిధిలోని సంఘాలకు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంఘాలకు రూ.1200 కోట్లు ఇవ్వనున్నారు. ఎస్సీలకు రూ.750 కోట్లు, ఎస్టీలకు రూ.410 కోట్లు, వికలాంగులకు రూ.40 కోట్లు రుణాలు పంపిణీ చేస్తారు.