వరంగల్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఎఫ్సీఐ గోదాముల్లో బియ్యం నిల్వలు పేరుకుపోయి జీరోస్పేస్గా మారింది. ఎప్పటికప్పుడు నిల్వలను తరలిస్తూ ఎఫ్సీఐ కొత్త బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎక్కువ సంఖ్యలో వ్యాగన్లను కేటాయించుకోవాలి. లేదా అదనపు గోదాములను తీసుకొని బియ్యం నిల్వ చేసుకోవాలి. ప్రస్తుతం గోదాములన్నీ నింపేసిన ఎఫ్సీఐ.. ఆ సాకుతో బియ్యం సేకరణలో జాప్యం చేస్తున్నది. ఇవేమీ పట్టించుకోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వమే బియ్యం ఇస్తలేదంటూ నెపం మోపుతున్నది.
తెలంగాణలో బియ్యం సేకరణపై ఎఫ్సీఐ వ్యవహరిస్తున్న తీరుతో గోదాముల వద్ద లారీలు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. వరంగల్ జిల్లా నెక్కొండలో 1.20 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న గోదాములను ఎఫ్సీఐ నిర్వహిస్తున్నది. వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, హనుమకొండ తదితర జిల్లాల బియ్యాన్ని ఇక్కడ నిల్వ చేస్తారు. ప్రస్తుతం ఈ గోదాముల్లో పూర్తిస్థాయిలో బియ్యం నిల్వలున్నాయి. వాటిని తరలించేందుకు నెలకు 30 వ్యాగన్లు అవసరం ఉంటుంది. అయితే తెలంగాణ బియ్యం సేకరించడం ఇష్టంలేని కేంద్రం.. 10 వ్యాగన్లను మాత్రమే కేటాయిస్తున్నది. దీంతో ఈ గోదాములకు బియ్యం తీసుకొస్తున్న లారీలకు అన్లోడ్ కోసం ఎదురుచూపులు తప్పట్లేదు.
నో స్పేస్ పేరుతో చేతులెత్తేస్తూ..
నో స్పేస్ అంటూ అధికారులు చేతులెత్తేస్తుండటం వల్ల నెక్కొండలోని ఎఫ్సీఐ గోదాముల వద్ద బియ్యం లోడ్లతో వచ్చిన లారీలు క్యూలో ఉండిపోతున్నాయి. ఈ గోదాముల్లో ఖాళీ ఏర్పడేవరకు లారీ డ్రైవర్లు, క్లీనర్లు రోజుల తరబడి వేచి ఉంటున్నారు. ఇక్కడే వంటలు చేసుకొని తింటున్నారు. రాత్రింబవళ్లు బియ్యం లారీల వద్ద కాపలాగా ఉంటున్నారు. ఆదివారం నెక్కొండలోని ఎఫ్సీఐ గోదాముల వద్దకు ఒక వ్యాగన్ వచ్చింది. అందులో 3,600 టన్నుల బియ్యం లోడ్ చేశారు. ఈ స్పేస్ను సోమవారం నింపే అవకాశం ఉండగా శనివారం నుంచే రైస్మిల్లర్లు లారీల్లో బియ్యం పంపారు. ఆదివారం సాయంత్రం వరకు ఇక్కడ 13 లారీలు క్యూలో ఉండిపోయాయి. వ్యాగన్ వచ్చిందన్న సమాచారంతో వివిధ జిల్లాల రైస్మిల్లర్లు సైతం బియ్యా న్ని నెక్కొండ గోదాములకు తరలించే పనిలో ఉన్నారు. సోమవారం ఒక్కరోజే ఈ గోదాముల్లో ఖాళీ స్థలం నిండిపోనున్నది. స్పేస్ లేదంటూ ఎఫ్సీఐ అధికారులు బియ్యాన్ని అన్లోడ్ చేసుకోకుండా లారీలను ఆపేస్తుండటం వల్ల వెయిటింగ్ చార్జి పడుతుందని రైస్మిల్లర్లు వాపోతున్నారు.
అదనపు గోదాములకు నో..
బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు కావాల్సిన గోదాములు అద్దెకు లభించే అవకాశం ఉన్నప్పటికీ ఎఫ్సీఐ అధికారులు ఉద్దేశపూర్వకంగానే తీసుకోవట్లేదని స్పష్టమవుతున్నది. నెక్కొండలో ప్రస్తుత గోదాముల పక్కనే అదనంగా 30 వేల టన్నుల కెపాసిటీ కలిగిన ప్రైవేటు గోదాములు ఉన్నాయి. వాటిని ఎఫ్సీఐకి కిరాయికి ఇచ్చేందుకు యజమానులు సుముఖంగానే ఉన్నారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బియ్యాన్ని తీసుకోవటం ఇష్టంలేకనే ఎఫ్సీఐ ఆ గోదాములను అద్దెకు తీసుకోకుండా వివిధ కారణాలు చెప్తున్నట్టు తెలిసింది. దీంతో ప్రస్తుతం ఉన్న గోదాముల్లో ఖాళీ ఏర్పడినప్పుడే కొత్త బియ్యాన్ని తీసుకొంటున్నారు. వరంగల్ జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వం 1.90 లక్షల టన్నుల బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉన్నది.
ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇప్పటికే 1.30 లక్షల టన్నుల బియ్యాన్ని ఇచ్చింది. మరో 60 వేల టన్నులు పంపించాలి. జిల్లాలోని 28 బాయిల్డ్ రైస్మిల్లుల ద్వారా రోజూ సుమారు వెయ్యి టన్నుల బియ్యం ఎఫ్సీఐకి ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ లెక్కన 60 రోజుల వ్యవధిలో మిల్లర్లు 60 వేల టన్నుల బియ్యాన్ని డెలివరీ చేసేందుకు రెడీగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరంగల్ జిల్లా నుంచి ప్రతి రోజూ 1,000 టన్నులు వస్తేనే నెక్కొండలోని ఎఫ్సీఐ గోదాముల్లో స్థలం లేని పరిస్థితి నెలకొంటుంది. ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే బియ్యం నిల్వల పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు ఎఫ్సీఐ అధికారుల నుంచి జవాబు రావడం లేదు.
ఇక్కడే వంట చేసుకుంటున్నం
బియ్యంతో నెక్కొండ గోదాముకు ఎప్పుడొచ్చినా ఇదే పరిస్థితి. కిరాయి దొరుకుతుంది కదా అని ఆశపడితే లోడుతో రోజుల తరబడి పడిగాపులు తప్పుతలేవు. ఇక్కడికి ఎప్పుడొచ్చినా రెండు మూడు రోజులు పడుతున్నది. వ్యాగన్ రావటం లేటైతే వారం రోజులు పడుతున్నది. ఎఫ్సీఐ వాళ్లు బియ్యం అన్లోడు చేసుకునే వరకు లారీల వద్దే ఉంటూ.. ఇక్కడే వండుకుని తింటున్నం.
వెయిటింగ్ చార్జి పడుతున్నది
సీఎంఆర్ తొందరగా పూర్తి చేయాలని ధాన్యం మర ఆడించిన వెంటనే బియ్యాన్ని లారీల ద్వారా ఎఫ్సీఐ గోదాములకు పంపుతున్నం. తీరా అక్కడికి వెళ్లాక ఖాళీ లేదని లారీలను ఆపుతున్నారు. రెండు మూడు రోజులు లారీలు గోదాముల వద్దే ఉంటున్నాయి. వారం రోజులు లారీలు గోదాముల వద్ద ఉన్న సందర్భాలూ లేకపోలేదు. దీంతో లారీల యజమానులకు వెయిటింగ్ చార్జి చెల్లించాల్సి వస్తున్నది. ఇది రైస్మిల్లర్లకు అదనపు భారం అవుతుంది.
ఒక రాజు.. ఏడు ధాన్యం గింజల కథ
కేంద్రమా కేంద్రమా ధాన్యం ఎందుకు కొనవు?
రాష్ట్రంలో గోదాములన్నీ నిండిపోయి ఉన్నాయి.
గోదాము గోదాము ఎందుకు నిండుగా ఉన్నావు?
ఖాళీ చేసేందుకు రైల్వే నా దగ్గరకు వ్యాగన్లు పంపడం లేదు.
రైలు రైలు వ్యాగన్ ఎందుకు తేవడం లేదు?
ఎఫ్సీఐ నన్ను అడగడం లేదు.
ఎఫ్సీఐ ఎఫ్సీఐ ఎందుకు అడగడం లేదు?
కేంద్రం నన్ను అడగొద్దంటే, నేనెందుకు అడుగుతా!
కేంద్రమా కేంద్రమా ఎందుకు ఎఫ్సీఐని అడగొద్దన్నావు?
ఎఫ్సీఐ వ్యాగన్లు పంపితే గోదాములు ఖాళీ అవుతాయి. గోదాములు ఖాళీ అయితే ధాన్యం నిల్వలు పొర్లిపో యేలా ఉన్నాయని నేను చెప్పలేను. అట్లా చెప్పలేకపోతే, తెలంగాణలో యాసంగి వడ్లు కొనాల్సి వస్తది. వడ్లు కొంటే, రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్కు తలొగ్గినట్టు అవుతుంది.
అట్లా తలొంచితే నా రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయి. తెలంగాణ రైతు ఏమైతే నాకేంటి?
నా రాజకీయమే నాకు ముఖ్యం!