లోక్సభ ఎన్నికల ముందు నుంచి వ్యవసాయ సంక్షోభాన్ని అజెండాగా చేపట్టాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలకు తాజా పరిణామాలు ఊతం ఇచ్చాయి. కొన్ని నెలలుగా రైతులు ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ హైదరాబాద్ వేదికగా ధర్నా జరిపి సమర శంఖం పూరించారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం దేశ రాజకీయాల్లో కొత్త పరిణామాలకు నాందిగా చెప్పవచ్చు. ఏడేండ్లుగా కొనసాగుతున్న ప్రధాని మోదీ ఏకపక్ష రాజకీయాలకు తొలిసారిగా గట్టి సవాలు ఎదురైంది. మోదీ సర్కారు నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనను విరమించేది లేదని ఉత్తరాది రైతులు ప్రకటించారు. మరోవైపు కేసీఆర్ కూడా తెలంగాణలో పండించే వడ్లు కొంటారా కొనరా తేల్చండి అంటూ ఈ ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేశారు.
ట్రాక్టర్ల మీద యూపీ, పంజాబ్ రైతులు ఆందోళనకు బయలుదేరినప్పుడు, ఆ వృద్ధరైతులు ఢిల్లీ సరిహద్దు రోడ్ల మీద అహింసాయుతంగా, అచంచలంగా 14 నెలలపాటు నిరసన దీక్షను కొనసాగిస్తారని చాలా మంది ఊహించలేదు. ఇంతకాలం వారు ఎటువంటి స్థిరత్వాన్ని చూపించారో ప్రధాని ప్రకటన తర్వాత కూడా అదే స్థిరమైన వైఖరితో ఉండటం వారి చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. యూపీ, పంజాబ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలోనే ప్రధాని మోదీ వివాదాస్పద చట్టాల రద్దును ప్రకటించారనేది స్పష్టం. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాలని, ఇందుకోసం సంబంధిత పక్షాలతో చర్చలు జరుపాలని మోదీ సర్కారు ఇప్పటికీ భావించడం లేదు. వ్యవసాయ రంగాన్ని రైతులకు శ్రేయోదాయకంగా తీర్చిదిద్దడమెలాగ అనేది తెలంగాణ నమూనాను చూస్తే అర్థమయ్యేది. కానీ కేంద్రం భిన్నాభిప్రాయాలను గౌరవించడమే లేదు.
రైతు ఉద్యమంలో 700 మందికి పైగా అమరులైన నేపథ్యంలో, వీరి కుటుంబాలను ఆదుకోవడానికి రూ.3 లక్షలు చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి రైతులోకం పట్ల తన సంఘీభావాన్ని మరోసారి చాటుకున్నారు. తెలంగాణలో పండించే ధాన్యాన్ని కొనే విషయంలోనూ ఏదో ఒకటి తేల్చి చెప్పాలని కేంద్రాన్ని నిలదీస్తున్నారు. రైతుల పొట్టగొట్టే విద్యుత్ సంస్కరణల్ని కూడా ముఖ్యమంత్రి తొలినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులు దేశవ్యాప్తంగా సంఘటిత శక్తిగా మారి తమ డిమాండ్లను సాధించుకోవాలని కేసీఆర్ ఎంతోకాలంగా సూచిస్తున్నారు. ప్రత్నామ్నాయ ప్రణాళికతో రాజకీయ పునరేకీకరణ జరగాలని కూడా పిలుపునిస్తున్నారు. ఇప్పటికైనా వివిధ ప్రాంతీయ శక్తులు, వ్యవసాయ సంఘాలు కేసీఆర్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలి. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటానికి సిద్ధపడాలి.