యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా బొందుగుల గ్రామంలో రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండడంతో పాటు అధికారులు, మిల్లర్ల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ధాన్యపు బస్తాలకు నిప్పంటించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని, వర్షాలు పడే అవకాశం ఉండటంతో ధాన్యం తడిసి భారీ నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే కోతలు పూర్తయి ధాన్యం కేంద్రాలకు తరలించినప్పటికి తూకం, లిఫ్టింగ్ పనులు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.