కట్టంగూర్, డిసెంబర్ 1 : పంట మార్పిడితోనే ఫాయిదా ఉంటుందంటున్నాడు.. కట్టంగూరు మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన యువ రైతు నర్సింగ్ రమేశ్. ఏటా ఒకే రకమైన పంటల సాగుతో నష్టాల బారిన పడుతున్న రైతులకు పంట మార్పిడే ఏకైక పరిష్కార మార్గమని అనుభవంతో చెప్తున్నాడు. యాసంగిలో వరి సాగు వద్దని ప్రభుత్వం సూచించిన క్రమంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపుతున్నారు. రమేశ్ సైతం కొద్దిపాటి భూమిని కూరగాయల సాగుకు ఉపయోగిస్తూ మంచి రాబడి పొందుతున్నారు. ఎకరం 20గుంటల భూమిలో 30గుంటలు కూరగాయల సాగుకు కేటాయించాడు. అందులో 11రకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు. రూ.15వేల పెట్టుబడితో టమాట, దోస, బీర, మిర్చి, గోకర, చిక్కుడు, బెండ, సొర, కాకర, బీర, వంకాయతో పాటు పచ్చిమిర్చి, పాలకూర, కొత్తిమీర, ఉల్లి సాగు చేస్తున్నాడు. కూలీలను పెట్టుకోకుండా కుటుంబ సభ్యులంతా కలిసి అన్ని పనులు చేస్తున్నారు. కూరగాయలకు ఉన్న డిమాండ్ కారణంగా నిత్యం ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాడు. పంటను స్వయంగా గ్రామాల్లో, కట్టంగూర్ సంతలో విక్రయిస్తున్నాడు.
ఆశాజనకంగా సాగు…
రెండేండ్లుగా 30గుంటల భూమిలో కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నాను. కూలి పనులకు పోయి రెక్కలు ముక్కలు చేసుకోవడం కంటే సొంతంగా కూరగాయలు సాగు చేయడం మంచిదనిపించింది. మార్కెట్లో మంచి ధరలు ఉండడంతో రోజూ పొలంలోనే కూరగాయలను పండించి ఊళ్లో, సంతలో అమ్ముకుంటున్నాను. ఒకే రకమైన పంటలు వేసి నష్టపోకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సాగు చేస్తే మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చు.