ఏ ఆదరణ లేక.. ఎవరి ప్రోత్సాహం లేక అట్టడుగుకు పడిపోయిన ఎవుసాన్ని పండుగలా మార్చి, అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు కర్షకలోకం జైకొడుతున్నది. అనేక పథకాలు అమలు చేస్తూ.. పంటకు పెట్టుబడి సాయం ఇస్తుండడంపై నీరాజనం పడుతున్నది. రైతు బంధు వారోత్సవాల సందర్భంగా ఊరూరా సంబురాలు చేసుకుంటున్నది. గురువారం గ్రామాలు, పంటక్షేత్రాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి అన్నదాతలు ‘జై కేసీఆర్’ ‘జై రైతుబంధు’ ఆకృతుల్లో పంట ఉత్పత్తులను తీర్చిదిద్ది, రంగ వల్లులు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ధర్మారంలో 50 ఎడ్ల బండ్లతో ర్యాలీ తీయగా, మరోవైపు రైతువేదికలు, పాఠశాలల్లో వేడుకలు జరుపుకొన్నారు.
కరీంనగర్, జనవరి 6(నమస్తే తెలంగాణ) : రైతు బంధు సంబురాలు ఊరూరా అంబరాన్నంటుతున్నాయి. గురువారం కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో వేడుకలు చేసుకున్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని చెర్లభూత్కూర్లో ఓ రైతు తన పొలంలో కేసీఆర్ అని నారుతో రాసి తన అభిమానాన్ని చాటుకున్నారు. జమ్మికుంట మండలం నాగంపేటలో రైతుబంధు పేరును నారుమడిలో రాసి ప్రదర్శించారు. ఇల్లందకుంట మండలం బోగంపాడులో కూడా ఇదే విధంగా రైతులు నారుమడిలో రాసి అభిమానాన్ని చాటుకున్నారు.
శంకరపట్నం మండలం మెట్పల్లితోపాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు, అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు రైతుబంధు సంబురాలు చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలో సుమారు 100 ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించగా, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాటారం ప్రధాన రహదారిపై రైతులతో కలిసి ఎడ్లబండిని స్వయంగా నడుపుకుంటూ వెళ్లారు. అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద ప్రసంగించారు.
ఓదెల మండలం కొలనూర్లో వరి పంటను విడిచి పెట్టి ఇతర పంటలు సాగు చేసిన రైతులను స్థానిక రైతు వేదికలో సన్మానించారు. ఓదెల, గుంపుల రైతు వేదికలలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ధర్మారం మండలం ఖిలావనపర్తి, బొట్లవనపర్తి గ్రామాల్లో ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య ఆధ్వర్యంలో రైతులు 50 ఎడ్లబండ్లతో ర్యాలీ తీశారు. అనంతరం ఎంపీపీ కరుణశ్రీతో పాటు పార్టీ ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండాలోని వ్యవసాయ క్షేత్రాల్లో పలువురు రైతులు.. ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, టీఆర్ఎస్ జిల్లా ఇంచార్జి తోట ఆగయ్యతో కలిసి ‘కేసీఆర్ అక్షరాకృతి వేసి సీఎం కేసీఆర్పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. బాకుర్పల్లి తండా, కిష్టూనాయక్తండా, గుంటపల్లి చెరువుతండా, బుగ్గరాజేశ్వరతండాలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
గంభీరావుపేట మండలం నర్మాలలో పంట పొలాల వద్ద ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ పలువురు రైతులతో కలిసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. జగిత్యాల అర్బన్ మండలం జాబితాపూర్ శివారులో లక్ష్మీపూర్కు చెందిన రైతు మల్లారెడ్డి తన ఏడెకరాలలో పండిన వివిధ రకాల కూరగాయలు, పండ్లతో జై కేసీఆర్ అని రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత అక్కడికి వెళ్లి వ్యవసాయ అధికారులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పంట చేలలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. మహిళా రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వెల్గటూర్ మండలం గుల్లకోటలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో కట్కూరి గంగన్న అనే రైతు పొలంలో వరి నారుతో ‘జై రైతుబంధు, జై కేసీఆర్, జై కొప్పుల ఈశ్వర్, గుల్లకోట అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కొత్త మోటర్ కొనుక్కున్న
నాకు రెండెకరాల పొలం, రెండెకరాల తోట ఉంది. పదేండ్ల నుంచి పాత మోటరే ఉండె.. రిపేర్లు వచ్చి శానా నష్టం వచ్చేది. చేతిల పైసలు ఆడక కొత్త మోటర్ కొనుక్కోలె. నాలుగేండ్ల నుంచి రైతుబంధు పైసలు వస్తున్నయ్.. అప్పులన్నీ పోయి ఇప్పుడిప్పుడే చేతిల పైసలు అడుతున్నయ్. పోయినేడు రైతుబంధు కింద వానకాలం రూ.20 వేలు, యాసంగి రూ.20 వేలు వచ్చినయ్. ఈ పైసలతోటి కొత్త మోటరు కొనుక్కున్న. ఈ వానకాలంల వచ్చిన 20 వేలతో పైపులైను వేసుకున్న. ఇప్పుడు కూడా రూ.20 వేలు వచ్చినయ్. వీటితో పెట్టుబడి ఎళ్తది. యాసంగి పండిన పంట పైసలన్నీ మిగులుతయ్. గతంలో ఉన్న ఇబ్బందులు ఇప్పుడు లేవు. దీనంతటికీ రైతుబంధే కారణం. ఎంత కష్టమైనా ఓర్చుకొని సీఎం కేసీఆర్ సారు దీనిని ఇట్లనే ఉంచాలె. నాలాంటి ఎంతో మంది పేద రైతులకు లాభం ఉంటది. మేం తిన్న రేవును మర్చిపోం.
ఎన్కట అరిగోస పడ్డా
ఎన్కట పంట పెట్టుబడికి ఎల్లక అరిగోస పడ్డా. షావుకార్ల దగ్గరికి పోయి అప్పుతేనిదే ఎల్లకపోయేది. ఎప్పుడైతే రాష్ట్రం వచ్చి కేసీఆర్ సీఎం అయ్యిండో ఇగ మా బాధ తీరింది. తిరుగుడు తప్పింది. నాకు 3.30ఎకరాల భూమి ఉంది. పసలుకు రూ.18750 వస్తన్నయి. ఖర్చులన్నీ ఎల్లుతున్నై. విత్తనాలు, మందు బత్తాలకు, కూలీలకు, మోటార్ల పైపులు పాడైతే అవి రిపేరు చేయించేతందుకు పనికస్తన్నయి. ఎవలికి చెయ్యి చాపకుండ అయ్యింది. ఇంకా కాల్వల ద్వారా ఒక్క గుంట ఎండిపోకుండా నీళ్లు ఇయ్యవట్టే. సీఎం కేసీఆర్ సార్ ఎక్కినంకనే రైతులం అంతా బాగుపడుతున్నం. ఏ ప్రభుత్వంల ఇంత సుఖంగ లేం. ఇంత సక్కటి పనులు చేస్తన్న ఆయన్ను ఎట్ల మర్చిపోతం. జీవితాంతం గుర్తుంచుకుంటం.
యాసంగి సాయం టైంకు అందింది
రైతుబంధు పెట్టుబడి సాయం యాసంగి పంట సాగు టైంకు అందింది. దుక్కులు దున్ని నాట్లేసే టైంల సర్కారు సాయం అందించింది. రైతుబంధు పైసలతో యాసంగి పొలం ఏసుకుంటున్న. నా పేరిట ఉన్న 75గుంటల భూమికి రూ.9375లు నా ఖాతాలో వడ్డయ్. ఆ పైసలతో ఎవుసం పనులు చేస్తున్న. రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వం అధికారంలో ఉండడం రైతులకు ఎంతో మేలవుతుంది. గిసోంటి సర్కారు కలకాలం అధికారంలో ఉండాలె.
బతుకులు బాగైనయ్
గతంలో పెట్టుబడులు ఎల్లక ఇబ్బంది పడేటోళ్లం. నరకం చూసినం. అటు నీళ్లు.. ఇటు కరెంటు సరిగ్గా ఉండక.. పంటలు సరిగ్గా పండక అప్పులపాలైనం. రాష్ట్రం వచ్చిన తర్వాతనే మా బతుకులు బాగైనై. నాలుగేండ్ల సంది నాకు రైతుబంధు వస్తంది. పసలుకు రూ.10వేలు ఇస్తన్రు. అప్పటి నుంచి ఎవరి దగ్గరా చేయి చాచకుండా పనిచేసుకుంటున్న. సరారు ఇచ్చే పైసలతోనే విత్తనాలు, ఎరువులు కొంటన్న. సంతోషంగా ఎవుసం చేసుకుంటున్న. ఇంకా ఫ్రీ కరెంట్, గోదావరి నీళ్లు ఇస్తండు. ఇంకేం బాధుంటది మాకు. సార్ సల్లంగుండాలె.
పంట ఏసే టైంకు అందుతున్నయ్.
అందరూ దండుగ అన్న ఎవుసాన్ని సీఎం కేసీఆర్ సారు పండుగ చేసిండు. కొత్త రాష్ట్రంలో రైతులకు ఏ ఇబ్బందులు రాకుండా అన్ని సౌలతులు చేస్తున్నడు. గతంల కరంట్ కోసం ఎంతో గోసపడ్డం. కానీ, ఇప్పుడు ఫ్రీ కరెంట్తో సంతోషంగా బతుకుతున్నం. ఇంకా లాగోడికి తక్లీబ్ గావద్దని రైతు బంధు తెచ్చిండు. రైతుకు ఏదైనా జరగరానిది జరిగితే బీమాతో ఆదుకుంటండు. సాగునీటి కష్టాలు రావద్దని ఎస్సారెస్పీ కాల్వల ద్వారా చివరి భూములకు నీరందిస్తండు. కొత్త ప్రాజెక్ట్లు కట్టిచ్చిండు. ఊర్లళ్ల చెరువులు, కుంటలు మంచిగ చేయించిండు. విత్తనాలు, ఎరువులకు ఇబ్బందులు రాకుండ చూసిండు. దేశంలో ఏడలేని పథకాలు తెచ్చి మా కడుపు నింపుతుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం రైతుల పొట్ట కొడుతంది. తెలంగాణలో వడ్లు కొననని అంటంది. మేం ఎటుపోవాలె. మమ్ముల గోస పెట్టినోళ్లు మట్టిగొట్టుకపోతరు. కేంద్రం వడ్లను కొనాలె. లేదంటే తగిన గుణపాఠం చెబుతం. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. పసలుకు రూ.10 వేలు అస్తున్నయ్. కరెక్ట్ పంట ఏసే టైంకు అందుతున్నయ్. పెట్టుబడులకు అక్కరకత్తున్నై. శానా సంతోషం.