నమస్తే తెలంగాణ నెట్వర్క్: పంటలకు పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో జమ చేసిన మొత్తం రూ.50 వేల కోట్లకు చేరుకోవడంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. ఊరూరా రైతుబంధు సంబురాలు నిర్వహించారు. రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శనలు నిర్వహించి కృతజ్ఞతలు చాటుకొన్నారు. పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. అనేక ప్రాంతాల్లో చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, వరి నారుతో సీఎం కేసీఆర్, రైతుబంధు చిత్రపటాలను రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముగ్గుల పోటీలు, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
రంగు రంగుల రంగవల్లులు, ఆట, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలు, గొబ్బెమ్మలు, చెరుకు గడల ప్రదర్శనలతో సందడి చేశారు. ఘనంగా జరిగిన రైతుబంధు సంబురాలతో గ్రామాల్లో సంక్రాంతి పండుగ శోభ ముందే వచ్చిందన్న టాక్ వినిపించింది. ఖమ్మం హోల్సేల్ కూరగాయల మార్కెట్ నిర్వాహకులు, వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ అధికారులు మార్కెట్లో 50 క్వింటాళ్ల కూరగాయలతో 1,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటం సంబురాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మంత్రులు నిరంజన్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కటౌట్కు క్షీరాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో వివిధ రంగులతో రూపొందించిన సీఎం కేసీఆర్ చిత్రమాలిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గంగిరెద్దుల ఆటలు, ముగ్గులు, గొబ్బెమ్మల ఏర్పాటు, చెరుకు గడల ప్రదర్శన సంక్రాంతి పండుగ సందడిని తలపించింది. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొనడంతో ఉత్సవాలకు మరింత నిండుదనం వచ్చింది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో మత్స్య, పశుసంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, రైతుబంధు సమతి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంతోపాటు సత్తుపల్లి మండలం నారాయణపురం, వైరాలో నిర్వహించిన రైతుబంధు వేడుకల్లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని కోడూరు నుంచి మన్యంకొండ స్టేజీ వరకు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్గౌడ్ స్వయంగా ట్రాక్టర్ నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ రైతుబంధు సంబురాలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంబురాలు నిర్వహించి, స్వీట్స్ పంచిపెట్టారు.
వ్యవసాయానికి 2.5 లక్షల కోట్లు
రైతుబంధు సంబురాల్లో మంత్రి హరీశ్రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడేండ్లలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై రూ 2 లక్షల 50 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు వివరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఒకనాడు అప్పు పుట్టేది కాదని, పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని గుర్తుచేశారు. రైతుబంధు తెచ్చి సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచారని పేర్కొన్నారు. రైతులకు రూ.50 వేల కోట్ల పెట్టుబడి సాయాన్ని దేశంలో ఏ ప్రభుత్వమూ చేయలేదన్నారు. గతంలో ప్రభుత్వాలు రైతుల నుంచి రకరకాల పన్నులు వసూలు చేసేవని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ధరలు పెంచి వ్యవసాయాన్ని భారం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పండిన పంటను కొనలేమని చేతులెత్తేసిన దద్దమ్మ ప్రభుత్వం బీజేపీదేనని మండిపడ్డారు. రైతులను పిట్టల్లా కాల్చి చంపిన చరిత్ర మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్దని విమర్శించారు. రాష్ర్టానికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్న బీజేపీ ముఖ్యమంత్రులు దమ్ముంటే అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో రాష్ట్రంతో పోటీ పడాలని సవాల్ చేశారు.